“99 మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్.. పరీక్షలకు భయ పడతాడా” అని వైసీపీ అధినేత, సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి మేమంతా సిద్ధం పేరుతో గత కొన్నిరోజులుగా ప్రచారం చేస్తున్న ఆయన తాజాగా ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లెలో ప్రసంగించారు. ప్రస్తుత ఎన్నికల్లో తాను ఒంటరిగానే పోటీ చేస్తున్నానని చెప్పిన జగన్.. విపక్షాల్లో ఆ ధైర్యంలేదని.. అందుకే కలిసి తనపైకి పోటీ పడుతున్నాయని చెప్పారు. అయితే.. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం తనకు ప్రజలే ఇచ్చారని చెప్పారు. 99 మార్కులు తెచ్చుకన్న విద్యార్థి.. పరీక్షలకు భయపడతాడా? అని ప్రశ్నించారు. ఇదేసమయంలో విపక్షాలపై ఆయన విమర్శలు గుప్పించారు. తనపై ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఏ ఒక్కరికీ లేదని అన్నారు. అధికారం కోసం గుంపులుగా, తోడేళ్ల మందలా, జెండాలు జతకట్టి అబద్ధాలతో వస్తున్నారని విమర్శించారు.జెండాలు జతకట్టడమే వారి పని అని, మీ గుండెల్లో గుడికట్టడమే జగన్ చేసిన పని అని సీఎం వ్యాఖ్యానించారు.