ప్రస్తుత టీమ్ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవికాలం టీ20 ప్రపంచకప్తో ముగియనుంది. 🏏 ఈ నేపథ్యంలో కొత్త కోచ్ కోసం బీసీసీఐ వేట మొదలెట్టింది. టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోని కోచ్గా రావాలని చాలా మంది కోరుకుంటున్నారు. అయితే ధోని అర్హుడు కాదు.
బీసీసీఐ నిబంధనల ప్రకారం, అన్ని ఫార్మాట్ల్లోనూ రిటైర్మెంట్ తీసుకున్న ఆటగాళ్లు మాత్రమే హెడ్కోచ్ పదవికి అర్హులు. ధోని అంతర్జాతీయ క్రికెట్కు 2020 ఆగస్టు 15న వీడ్కోలు పలికినప్పటికి, ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ప్రస్తుతం ఆడుతున్నాడు. దీంతో ధోని దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లేదు. ఐపీఎల్ 2024 సీజన్ చివరిది అని ప్రచారం జరిగినప్పటికి ధోని స్పందించలేదు.
ధోని ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్నాడు. ఐపీఎల్ 17వ సీజన్లో అతడు 220 కంటే ఎక్కువ స్ట్రైక్రేటుతో పరుగులు రాబట్టాడు. 11 ఇన్నింగ్స్ల్లో కేవలం మూడు సార్లు మాత్రమే ఔట్ అయ్యాడు. 2021లో యూఏఈలో జరిగిన టీ20 ప్రపంచకప్లో ధోని టీమ్ఇండియాకు మెంటార్గా ఉన్నాడు. ఆ టోర్నీలో భారత్ గ్రూప్ దశలోనే ఓడిపోయింది.
భారత కొత్త ప్రధాన కోచ్గా ఎవరు ఫేవరెట్?
భారత ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తులు సోమవారంతో ముగిశాయి. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి బీసీసీఐ పబ్లిక్ గూగుల్ ఫారమ్ను విడుదల చేసింది. 3 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదించిన ప్రకారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, సచిన్ టెండూల్కర్ పేర్లతో చాలా నకిలీ దరఖాస్తులు వచ్చాయి.