ఉత్తరాఖండ్లోని పవిత్ర చార్ ధామ్ యాత్రలో రోజు రోజుకీ భక్తుల సంఖ్య పెరుగుతోంది. కేధార్ నాథ్, బద్రీనాథ్ ఆలయ తలపులు తెరుచుకున్నాయి. దీంతో భారీగా భక్తులు శివ కేశవులను దర్శించుకోవడానికి పోటెత్తుతున్నారు. అదే సమయంలో ఆలయ ప్రాంగణంలో భక్తులు రీళ్లు చేసి.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అందువల్ల కొంతమంది భక్తులు యాత్ర, ఆలయ చేసే అనుభూతిని మిస్ అవుతున్నారని గుర్తించిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది.
ఉత్తరాఖండ్ ప్రభుత్వం రిలీజ్ చేసిన మార్గదర్శకాల ప్రకారం యాత్రికులు ఇకపై గంగోత్రి , యమునోత్రి , కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయ ప్రాంగణంలోని 50 మీటర్ల పరిధిలో వీడియోలను చిత్రీకరించడం లేదా రీల్స్ తీయడంపై నిషేధం విధించింది. దైవ దర్శనం కోసం చేసే ఈ పవిత్ర తీర్థయాత్రలో ఆధ్యాత్మికత కొరవడుతోందని ఆందోళనలు రేకెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఆధ్యాత్మిక ప్రదేశంలో మనసు ప్రశాంతంగా ఉండడం కోసం వెళ్తే.. అక్కడ వీడియో షూటింగ్ కోసం భారీ సంఖ్యలో భక్తులు గుమిగూడడం, బిగ్గరగా సంగీతం ప్లే చేయడం వంటి కార్యకలాపాలతో పుణ్యక్షేత్రాల ప్రశాంతతకు భంగం కలుగుతోందని.. ఇతర భక్తులకు అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయని పేర్కొంది.
చార్ ధామ్ దేవాలయాలలో వీడియోలు, రీల్స్ నిషేధించినట్లు ఉత్తరాఖండ్ ప్రధాన కార్యదర్శి, రాధా రాటూరి స్పష్టం చేశారు. దేవాలయాల పవిత్రతను కాపాడటంతో పాటు, యాత్రికులందరికీ సౌకర్యాన్ని కల్పించడమే లక్ష్యమని ఉద్ఘాటించారు. ఈ రోజు డెహ్రాడూన్లో ముఖ్యమంత్రి చార్ ధామ్ ఏర్పాట్లపై వివరణాత్మక సమీక్ష నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని 50 మీటర్ల పరిధిలో ఎవరూ వీడియోలు చిత్రీకరించవద్దని, రీళ్లు చేయవద్దని ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. భక్తుల మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉండే చర్యలు నిరసించదగ్గవని స్పష్టం చేశారు.