top of page

UPSC Civils Prelims 2024 Postponed: యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ 2024 ప్రిలిమ్స్‌ వాయిదా.. కొత్త తేదీ ప్రకటన




యూపీఎస్సీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2024 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా పడింది. త్వరలో దేశ వ్యాప్తంగా జరగనున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రాథమిక పరీక్ష (ప్రిలిమ్స్‌) తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మేరకు పరీక్షను రీషెడ్యూల్‌ చేస్తూ మంగళవారం (మార్చి 20) ప్రకటన వెలువరించింది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు మే 26వ తేదీన ప్రిలిమ్స్ పరీక్ష ఉంటుందని కమిషన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ తేదీని మార్పు చేసిన యూపీఎస్సీ ప్రాథమిక పరీక్షను జూన్ 16కు వాయిదా వేసింది. అలాగే యూపీఎస్సీ సివిల్స్‌ పరీక్షతోపాటు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్షను కూడా వాయిదా వేసింది. ఈ పరీక్ష తేదీని కూడా మే 26 నుంచి జూన్ 16కు వాయిదా వేసినట్లు తన ప్రకటనలో వెల్లడించింది.

18వ లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు జరగనున్నట్లు ఎన్నికల సంఘం గత శనివారం ప్రకటించిన నేపథ్యంలో పరీక్ష టైం టేబుల్‌ రీషెడ్యూల్‌ చేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష – 2024ను వాయిదా వేయాలని కమిషన్ నిర్ణయించింది. సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్షతోపాటు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2024 స్క్రీనింగ్ టెస్ట్‌ తేదీ కూడా మే 26, 2024 నుంచి జూన్‌ 16, 2024కు వాయిదా వేస్తున్నట్లు కమిషన్‌ అధికారిక నోటిఫికేషన్ వెలువరించింది.

కాగా యూపీఎససీ ఐఏఎస్‌, ఐపీఎస్‌ ప్రిలిమినరీ రాత పరీక్షలు రెండు షిఫ్టులలో నిర్వహించబడతాయి. ఉదయం షిఫ్టులో జనరల్ స్టడీస్, మధ్యాహ్నం షిఫ్టులో సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (CSAT) ఉంటుంది. GS పేపర్ ఉదయం సెషన్‌లో 9:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం సెషన్ మధ్యాహ్నం 2:30 నుండి 4:30 వరకు ఉంటుంది. ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్ పరీక్షకు కనీసం 10 రోజుల ముందు కమిషన్‌ విడుదల చేస్తుంది. అభ్యర్థులు తమ UPSC ప్రిలిమ్స్ హాల్ టికెట్ 2024ను upsc.gov.in అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేయడానికి అభ్యర్ధుల రిజిస్ట్రేషన్ నంబర్‌, రోల్ నంబర్ లేదా పుట్టిన తేదీని నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ ఏడాది UPSC CSE పరీక్షకు మొత్తం 1056 ఖాళీలు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFoS)కు 150 ఖాళీలను ప్రకటించింది. ఎంపిక విధానం మూడు దశల్లో ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, పర్సనాలిటీ టెస్ట్. ప్రిలిమినరీ పరీక్షలో ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. కటాఫ్ మార్కుల కంటే ఎక్కువ స్కోర్ చేసిన అభ్యర్థులు మెయిన్ ఎగ్జామ్ 2024కి అర్హత సాధిస్తారు. యూపీఎస్సీ సివిల్స్‌ మెయిన్ పరీక్షలు సెప్టెంబర్ 20 నుంచి ఐదు రోజుల పాటు నిర్వహిస్తారు.

bottom of page