బంగాళాఖాతంలో వాయుగుండం బలపడింది. ఆంధ్రప్రదేశ్పై తుఫాన్ ప్రభావం ఉండదని వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడుతోంది. నేటికి వాయుగుండం తుఫాన్గా మారనుంది. ఈ తుఫాన్కి రెమాల్గా నామకరణం చేశారు. ఇవాళ సాయంత్రానికి తీవ్ర తుఫాన్గా మారనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది..
ఆదివారం మే 26వ తేదీన అర్థరాత్రి బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీవ్ర తుపాన్గా తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరందాటే సమయంలో గంటకు 90నుంచి 110కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. అయితే ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన చేసింది వాతావరణశాఖ. ఉత్తర ఒడిశా, బెంగాల్, మిజోరాం..త్రిపుర, మణిపూర్పై తుఫాన్ ఎఫెక్ట్ బాగా ఉంటుందని తెలిపింది ఐఎండీ. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.
మధ్య బంగాళాఖాతంలో సముద్రం ఆటుపోట్లకు గురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని సూచించారు. అన్ని పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు విశాఖ వాతావరణ శాఖ అధికారి డాక్టర్ సునంద తెలిపారు. తుఫాను ప్రభావం రాష్ట్రంపై ఉండదని, అత్యధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని వివరించారు. తుపాను ప్రభావంతో రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని వాతావరణశాఖ పేర్కొంది. నైరుతి రుతుపవనాలు శ్రీలంక వరకు విస్తరించాయని వెల్లడించారు.