top of page

తిరుమలలో మళ్లీ అదే తప్పు..

తిరుమలలో ఇటీవల కాలంలో విమానాలు చక్కర్లు కొట్టడం కలకలంరేపుతోంది. తాజాగా ఒకే రోజు ఏకంగా 6 విమానాలు ఆలయానికి సమీపంలో ఎగిరాయి.

కొందరు భక్తులు తమ మొబైల్స్‌లో విమానాలను వీడియోలు తీయడంతో వైరల్ అయ్యాయి. ఇటీవల కాలంలో వరుసగా ఇలా విమానాలు ఆలయ సమీపంలో చక్కర్లు కొట్టడం కలకలంరేపుతోంది. ఆగమ శాస్త్రం ప్రకారం తిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి విమానాలు, హెలికాప్టర్లు ఎగరడం సరికాదనే వాదనలు ఉన్నాయి.తిరుమల శ్రీవారి ఆలయం సమీపంలో నుంచి తరుచూ విమానాలు చక్కర్లు కొడుతుండడంతో భక్తులను కలవరపరుస్తోంది. తాజాగా గురువారం స్వామివారి ప్రధాన ఆలయం పైనుంచి ఏకంగా ఆరు విమానాలు వెళ్లడం కలకలం రేపుతోంది. ఉదయం 7 నుంచి 8 గంటల ప్రాంతంలో వరుసగా ఒకటి తరువాత ఒకటి ఆలయానికి సమీపంలో వెళ్లాయి. దీన్ని భక్తులు తమ సెల్‌ఫోన్లలో వీడియోలు తీయగా అవి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.విమానాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నాయో తెలియరాలేదు. ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయంపై నుంచి విమానాలు, హెలికాప్టర్లు ఎగరడం నిషిద్ధం. ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కావటంతో టీటీడీ అధికారులు ఇప్పటికే పలుసార్లు పౌర విమానయాన శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపినా కేంద్రం స్పందించటం లేదు.

కొంత కాలంగా తరచూ శ్రీవారి ఆలయం, వెంగమాంబ నిత్యాన్నదాన సత్రం మీదుగా విమానాలు వెళ్లటంపైన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతవారం వరుసగా ఒకే రోజు మూడు విమానాలు శ్రీవారి ఆలయం మీదుగా వెళ్లాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు టీటీడీ విజిలెన్స్‌ అధికారులకు సమాచారం సేకరించాలని ఆదేశాలు జారీ చేశారు. తిరుమలకు ఉన్న ప్రత్యేకత, విశిష్ఠత కారణంగా నో ఫ్లయింగ్‌ జోన్‌లోకి తీసుకురావాలని ప్రతిపాదించినా కేంద్రం నుంచి సానుకూల స్పందన రావడం లేదు. ఈ నిబంధన అమలు చేయటం వీలుకాదని ఆ శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేసినట్లు సమాచారం. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు చాలానే చోటుచేసుకుంటున్నా టీటీడీ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. తరుచూ తిరుమల మీదుగా విమానాలు, హెలికాప్టర్లు వెళ్లిన సమయంలో టీటీడీ అధికారులు విమానయాన శాఖకు ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకుంటూ చేతులు దులిపేసుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా విమానయాన శాఖకు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. అంతేకాదు ఇటీవల తిరుమల ఆలయం భద్రతకు సంబంధించి కూడా అధికారులు సమావేశం నిర్వహించిన సమీక్షించిన సంగతి తెలిసిందే.ప్రపంచంలోనే ప్రసిద్ధ హిందూ దేవాలయంగా గుర్తింపు పొందిన తిరుమల క్షేత్రానికి ఉగ్ర ముప్పు ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో తిరుమలలో ఆక్టోపస్‌ భద్రతా సిబ్బందితో పహారా ఏర్పాటు చేశారు. భూమ్మీద ఎంత భద్రత పటిష్టం చేసినా గగనతలంలో మాత్రం గాలికొదిలేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై కేంద్రం వెంటనే స్పందించి ఆలయం సమీపంలో విమానాల రాకపోకలపై నిషేదం విధించేలా చర్యలు తీసుకోవాలని స్వామివారి భక్తులు కోరుతున్నారు.

Comentários


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page