తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కజగం పార్టీ అధినేత విజయ్ డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. టెన్త్, ఇంటర్లో మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులకు టీవీకే పార్టీ తరఫున ఆర్థిక సాయం అందించారు. చెన్నైలోని తిరువన్ముయార్లో జరిగిన ఈ కార్యక్రమంలో వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇదే వేదికపై విద్యార్థులకు నటుడు విజయ్ సందేశం ఇచ్చారు. రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా రాజ్యమేలుతోందని, దీన్ని అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. మాదక ద్రవ్యాలను నియంత్రించేందుకు స్టాలిన్ సర్కార్ ఏ ప్రయత్నం చేయలేదని ఆరోపించారు. తమిళనాడులో డ్రగ్స్ వాడకం ఎక్కువైందని, ఒక పెరేంట్గా, రాజకీయ పార్టీ నాయకుడిగా తానూ దీన్ని గురించి భయపడుతున్నానని తెలిపారు.
యువతను డ్రగ్స్ నుంచి రక్షించడం ప్రభుత్వ కర్తవ్యమని విజయ్ పేర్కొన్నారు. తమిళనాడు రాష్ట్రంలో మంచి నాయకులు రావాల్సిన అవసరముందని చెప్పారు. తాత్కాలిక ఆనందాలకు యువత నో చెప్పాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో కొన్ని రాజకీయ పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని, యువత వాటిని నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. యువకులను రక్షించడం ప్రభుత్వ బాధ్యత అని తాను చెప్పను కానీ ప్రస్తుత పాలక ప్రభుత్వం ఆ పని చేయడంలో విఫలమైందని తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ అన్నారు.
డీఎంకే ప్రభుత్వంపై విజయ్ విమర్శలు చేయడం ఇదే మొదటిసారి. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ తమిళగ వెట్రి కజగం (టీవీకే) కూడా పోటీ చేయనుంది. ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టాలని యోచిస్తున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మరోవైపు ఇటీవల కళ్లకురిచిలో కల్తీసారా తాగి 60 మంది చనిపోయారు. దీనిపై HRC సుమోటగా విచారణ చేపట్టి వారంలోగా నివేదిక ఇవ్వాలని తమిళనాడు సీఎస్, డీజీపీకి నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం కల్తీసారా బాధితులు చాలా మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
‘తలపతి’ విజయ్ విద్యా పురస్కార ప్రదానోత్సవంలో విజయ్ స్టాలిన్ సర్కార్ టార్గెట్ గా విమర్శలు చేయడం తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా మారింది.