top of page
MediaFx

తెలంగాణలో అనూహ్య ఫలితాలు..

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌-బీజేపీ మధ్య టైట్‌ ఫైట్‌ నడిచింది. మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి.కాంగ్రెస్‌- బీజేపీ మధ్య చివరి వరకూ హోరాహోరీ నడిచింది. చెరో 8 స్థానాల్లో పోటాపోటీగా ఉన్నాయి. ఇక ఎప్పటిలాగే మజ్లిస్‌ కంచుకోటను MIM దక్కించుకుంది. ఇక్కడ ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే.. విపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీ ఎక్కడా ప్రభావం చూపకపోవడం గులాబీ శ్రేణులను నిరాశలోకి నెట్టేసింది.

తెలంగాణలో అధికార కాంగ్రెస్‌ పార్టీ మొత్తం 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అందులో పెద్దపల్లి, జహీరాబాద్‌, వరంగల్‌, మహబూబాబాద్, ఖమ్మం, భువనగిరి, నల్గొండ, నాగర్‌కర్నూలులో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు లీడ్‌లో ఉన్నారు. ఖమ్మం, నల్లగొండ అభ్యర్థులు భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్తున్నారు. పార్లమెంట్ స్థానాల ఫలితాలను చూస్తే కాంగ్రెస్‌కు 40.5%, బీజేపీకి 34.5%, బీఆర్ఎస్‌కు 17.4% ఓట్ల శాతం దక్కినట్లు విశ్లేషకులు అంచనా వేశారు.

ఇక తెలంగాణలో కాషాయం పార్టీ గతంలో కన్నా మెరుగైన స్థానాలను సాధించేదిశగా ముందుకెళ్తోంది. 2019లో కేవలం నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకున్న బీజేపీ, ఈసారి 8 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కరీంనగర్‌, మల్కాజ్‌గిరి బీజేపీ అభ్యర్థులు భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్తున్నారు.

తెలంగాణ పార్లమెంట్‌ స్థానాల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ డబుల్ డిజిట్‌ సాధించాలన్న ప్రయత్నాలను.. మోదీ వేవ్‌తో కమలం పార్టీ దెబ్బకొట్టింది. అనూహ్యంగా సీట్ల సంఖ్యను పెంచుకుంది బీజేపీ. గతంలో కేవలం సికింద్రాబాద్‌లో మాత్రమే గెలిచిన బీజేపీ, ఈసారి జంటనగరాలు, రంగారెడ్డిజిల్లాలో పట్టు నిలుపుకుంది. సికింద్రాబాద్‌ తోపాటు మల్కాజ్‌గిరి, చేవెళ్ల స్థానాల్లో గెలుపు దిశగా ముందుకెళ్తోంది బీజేపీ.

bottom of page