top of page
MediaFx

తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల వరకు వానలు..

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నిన్న మొన్నటి వరకు ఎండలు దంచి కొట్టగా.. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఏపీ, తెలంగాణలో కూల్‌ వాతావరణం నెలకొంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే వాతావరణ శాఖ మరో చల్లని కబురు చెప్పింది. ఏపీలో రెండు రోజులపాటు.. తెలంగాణలో నాలుగు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. తమిళనాడులో ఏర్పడిన ద్రోణి ప్రభావం.. తెలుగు రాష్ట్రాలపై బలంగా విస్తరించిందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. దాంతో.. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతోపాటు.. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని హెచ్చరించింది వాతావరణ శాఖ.

ఇప్పటికే.. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. కర్నూలు జిల్లా కోడుమూరులో ఉరుములు- మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలుల ధాటికి పలు ప్రాంతాల్లో రేకుల షెడ్లు ధ్వంసం అయ్యాయి. అటు.. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. అయితే.. గత నెల రోజులుగా మండే ఎండలు, ఉక్కపోత నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు వర్షంతో ఉపశమనం కాస్త ఉపశమనం లభించింది.

ఇక.. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మరోసారి వర్షం కురుస్తోంది. కూకట్‌పల్లి, నిజాంపేట్‌, కుత్బుల్లాపూర్‌, శంషాబాద్‌, రాజేంద్రనగర్‌లో వర్షం పడింది. హైదరాబాద్‌లో ఉదయం నుంచే వాతావరణం చల్లబడి ఉంది. నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌ నగరంలో అకస్మాత్తుగా వర్షం బీభత్సం సృష్టించింది. మరోసారి భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో జీహెచ్‌ఎంసీ అలెర్ట్‌ అయింది.

bottom of page