ఏపీ ఎన్నికల్లో కడప రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. కడపలో రెండు సార్లు ఎంపీగా గెలిచిన అవినాశం వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు.
పీసీసీ చీఫ్ గా ఉన్న షర్మిల తొలి సారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నారు. అవినాశ్ పైన పోటీ చేస్తున్నారు. సీఎం జగన్ ఇడుపులపాయ కేంద్రంగా తన పార్టీ అభ్యర్దులను ప్రకటించారు. అక్కడి నుంచే తన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. జగన్ ను తల్లి విజయమ్మ ఆశీర్వదించి వైఎస్సార్ ఘాట్ నుంచి ప్రచారానికి పంపారు. ఆ తరువాత షర్మిల సైతం వైఎస్సార్ ఘాట్ వేదికగా తన పార్టీ అభ్యర్దులను ప్రకటించారు. షర్మిలతోనూ విజయమ్మ కలిసి వచ్చారు. దీంతో, విజయమ్మ ఎవరి వైపు నిలుస్తారనే చర్చ మొదలైంది. ఇప్పటి వరకు జగన్ ను మాత్రమే టార్గెట్ చేస్తూ వచ్చిన టీడీపీ తొలి సారి విజయమ్మను కార్నర్ చేసింది. విజయమ్మ జగన్, షర్మిల, అవినాశ్ లో ఎవరి వైపు నిలుస్తారో చెప్పాలని పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి డిమాండ్ చేశారు. మీ ఇద్దరు బిడ్డలు మేనిఫెస్టో, అభ్యర్థుల జాబితా విడుదల చేసినప్పుడు వైఎస్ సమాధి వద్దకు వెళ్లారు కదా.. నీబిడ్డ అని చెప్పుకొనే జగన్... రాజశేఖరరెడ్డి బిడ్డ షర్మిల పోటీ చేస్తున్నారు.. వైఎస్కు ఆత్మ ఉంటే తన కూతురు వైపు నిలబడతాడా నిలబడరా..? అంటూ ప్రశ్నించారు. విజయమ్మ ఎవరి వైపు నిలుస్తారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని బీ టెక్ రవి పేర్కొన్నారు. కనీసం పులివెందుల వాసులకైనా తెలపాలని వ్యాఖ్యానించారు. 🗳️