top of page
MediaFx

తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు సోనియా హాజరు.. కేసీఆర్‎కు లేఖ..


తెలంగాణ ఆవిర్భవించి 2024 జూన్ 2తో దశాబ్దం పూర్తవుతున్న సందర్భంలో రాష్ట్రానికి సోనియా గాంధీ విచ్చేయనున్నారు. జూన్ 2న ఉదయం 10.30కి పరేడ్ గ్రౌండ్‌లో జరుగే కార్యక్రమానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ హాజరుకానున్నారు. ముందుగా బేగంపేట విమానాశ్రయంలో దిగిన తర్వాత నేరుగా అమరవీరుల స్థూపం వద్దకు చేరుకుని నివాళులు అర్పించనున్నారు. ఆ తరువాత పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన రాష్ట్ర అవతరణ దినోత్సవంలో పాల్గొననున్నారు. సోనియా గాంధీ రాక నేపథ్యంలో భద్రతాపరమైన ఏర్పాట్లను అధికారులు పరిశీలిస్తున్నారు.

తెలంగాణలో దశాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమైంది రేవంత్ సర్కార్. ఈ తరుణంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే కార్యక్రమం నిర్వహణపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ప్రణాళికలు రచించారు.

ఇదిలా ఉంటే సీఎం రేవంత్ సర్కార్ ప్రభుత్వం తరఫున మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కూడా ప్రత్యేక ఆహ్వానం పంపింది. జూన్ 2వ తేదీన ఉదయం 10 గం.లకు పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల అధికారిక కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కేసీఆర్‌ను ఆహ్వానిస్తూ ప్రత్యేకంగా లేఖరాశారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే వ్యక్తిగత ఆహ్వాన పత్రిక పంపించినట్లు తెలిపారు. దానిని స్వయంగా కేసీఆర్‌కు అందించాలని ప్రోటోకాల్ సలహాదారు హర్కర వేణుగోపాల్‌కు, డైరెక్టర్ అరవింద్ సింగ్‌కు సూచించారు. కేసీఆర్‌ను స్వయంగా కలిసి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వాన పత్రిక అందించేందుకు కేసీఆర్ సిబ్బందితో చర్చలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ గజ్వెల్ ఫామ్ హౌస్‌లో ఉన్నారని సిబ్బంది తెలిపింది. అక్కడకు వెళ్లి స్వయంగా ఆహ్వాన పత్రిక, సీఎం రేవంత్ రెడ్డి రాసిన లేఖను అందించేందుకు హర్కర వేణుగోపాల్, డైరెక్టర్ అరవింద్ సింగ్ ప్రయత్నిస్తున్నారు.


bottom of page