top of page
MediaFx

భూమిని తాకిన శక్తిమంతమైన సౌర తుఫాను

గత రెండు దశాబ్దాలకు పైగా కాలంలో అత్యంత శక్తిమంతమైన సౌర తుఫాను శుక్రవారం భూమిని తాకింది. ఇందుకు సంబంధించిన ఖగోళ కాంతి ఆకాశంలో కనిపించింది. టస్మానియా నుంచి బ్రిటన్ వరకు ఈ కాంతి కనిపించింది. వారాంతం వరకు ఈ సౌర తుఫాను కొనసాగితే ఉపగ్రహాలు, పవర్ గ్రిడ్‌లకు అంతరాయాలు ఏర్పడే ముప్పు ఉందని అమెరికాకు వాతావరణ అంచనా సంస్థ నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్‌వోఏఏ) తెలిపింది. సీఎంఈలుగా (కరోనల్ మాస్ ఎజెక్షన్స్) పిలిచే సూర్యుడి అయస్కాంత క్షేత్రాలు,  ప్లాస్మా లండన్ కాలమానం (జీఎంటీ) ప్రకారం శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో భూమిని తాకాయని వివరించింది.కాగా ఈ సౌర తుఫానుకు సంబంధించి ఉత్తర యూరప్, ఆస్ట్రేలియాలలో ఏర్పడిన ‘అరోరా’లకు సంబంధించిన ఫొటోలను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎలాంటి పరికరాలు లేకుండా చూడగలిగామని పలువురు పేర్కొన్నారు.ఇది తీవ్రమైన భూ అయస్కాంత తుఫానుగా ఎన్‌వోఏఏ అంచనా వేసింది. రాబోయే రోజుల్లో మరిన్ని సీఎంఈలు భూమిని తాకే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సౌర తుఫాను కారణంగా భూమి అయస్కాంత క్షేత్రంలో సంభవించే సంభావ్య అంతరాయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఉపగ్రహ ఆపరేటర్లు, విమానయాన సంస్థలు, పవర్ గ్రిడ్‌లకు సూచించారు. కాగా అక్టోబర్ 2003లో సంభవించిన శక్తిమంతమైన సౌర తుఫాను కారణంగా స్వీడన్‌లో బ్లాక్‌అవుట్‌లు ఏర్పడ్డాయి. దక్షిణాఫ్రికాలో విద్యుత్ మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి.

bottom of page