top of page
MediaFx

వారందరికీ షాకింగ్ న్యూస్.. 5 లక్షల ఓబీసీ సర్టిఫికెట్లు రద్దు చేసిన హైకోర్టు


పశ్చిమ బెంగాల్‌లో అధికారంలో ఉన్న మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణముల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి లోక్‌సభ ఎన్నికల వేళ.. కలకత్తా హైకోర్టు మరో గట్టి షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో 26 వేల మంది టీచర్ల ఉద్యోగాలను రద్దు చేసిన కలకత్తా హైకోర్టు.. ఈసారి ఏకంగా 5 లక్షల ఓబీసీ సర్టిఫికెట్లను రద్దు చేస్తూ సంచలన తీర్పును వెలువరించింది. అయితే ఈ తీర్పు వెలువరించిన కలకత్తా హైకోర్టు.. ఇప్పటికే ఆ ఓబీసీ సర్టిఫికెట్ల ద్వారా ఉద్యోగాలు పొందిన వారు, రిజర్వేషన్ల ద్వారా లబ్ధి పొందిన వారిపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. దీంతో వారికి భారీ ఊరట లభించింది.

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని ఓబీసీ సర్టిఫికెట్లపై కలకత్తా హైకోర్టు చరిత్రాత్మక తీర్పును ఇచ్చింది. 2010 తర్వాత పశ్చిమ బెంగాల్‌లో జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. జస్టిస్ తపబ్రత చక్రవర్తి, జస్టిస్ రాజశేఖర్ మంథాలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో 5 లక్షల మంది ఓబీసీ సర్టిఫికెట్లు పొందిన వారిపై ప్రభావం పడనుంది.

పశ్చిమ బెంగాల్‌లో 2011 లో తృణముల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలోనే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు కాకుండా మిగిలిన వెనుకబడిన తరగతులకు సంబంధించి.. 2012 నాటి పశ్చిమ బెంగాల్‌ చట్టం కింద కొన్ని వర్గీకరణలు చేసింది. అయితే మమతా బెనర్జీ తీసుకువచ్చిన ఆ నిబంధనలు చట్టవిరుద్ధంగా ఉన్నాయంటూ సవాలు చేస్తూ పలువురు కలకత్తా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

ఆ పిటిషన్లను బుధవారం విచారణ జరిపిన హైకోర్టు.. అందులో పలు క్లాసులను రద్దు చేస్తున్నట్లు తీర్పు వెలువరించింది. 2010-2012 మధ్య దీదీ ప్రభుత్వం ఓబీసీ వర్గీకరణలుగా పేర్కొన్న 42 క్లాసులను కొట్టివేస్తున్నట్లు స్పష్టం చేశింది. అంతేకాకుండా ఆ వర్గీకరణలు చట్టవిరుద్ధంగా ఉన్నాయని తేల్చి చెప్పింది. దీంతో 2010 తర్వాత ఇచ్చిన అన్ని ఓబీసీ సర్టిఫికెట్లు ఇక ఇప్పటినుంచి పనిచేయవని ఆ తీర్పులో పేర్కొంది. 1993 నాటి వెనకబడిన వర్గాల చట్టానికి అనుగుణంగా కొత్త ఓబీసీ సర్టిఫికెట్లు సిద్ధం చేయాలని అధికారులను కలకత్తా హైకోర్టు ఆదేశించింది.

ఇక ఓబీసీ సర్టిఫికెట్లను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును తాము అంగీకరించబోమని తేల్చి చెప్పారు. ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇంటింటి సర్వే నిర్వహించి బిల్లు తీసుకొచ్చామని.. రాజ్యాంగానికి లోబడి తీసుకొచ్చిన ఆ బిల్లును శాసనసభ కూడా ఆమోదించిందని వెల్లడించారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం.. కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని ఆ చట్టాన్ని నిలిపివేయాలని కుట్ర పన్నిందని.. దాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరింబోమని తెలిపారు. ఓబీసీ రిజర్వేషన్లు కొనసాగుతాయని దీదీ స్పష్టం చేశారు.

bottom of page