top of page
MediaFx

తాజ్‌ మహల్‌కు పోటీగా ఆగ్రాలోనే మరో అద్భుత కట్టడం..

దేశ రాజధాని ఢిల్లీ సమీపంలో ఆగ్రా నగరంలో ఉన్న తాజ్ మహల్ ఒక.. కొన్ని శతాబ్దాలుగా ప్రపంచ వ్యాప్తంగా పేరు గాంచింది. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ కోసం 17 వ శతాబ్దంలో 22 ఏళ్లపాటు వేలాది మంది కార్మికులు కష్టపడి నిర్మించిన అద్భుత పాలరాతి కట్టడం తాజ్ మహల్.. ఎప్పటి నుంచో ప్రేమకు ప్రతిరూపంగా నిలుస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు అదే ఆగ్రా నగరంలో.. తాజ్ మహల్‌కు సమీపంలోనే మరో అద్భుతమైన పాలరాతి కట్టడం నిర్మాణం పూర్తి చేసుకుని అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఆ కట్టడమే పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అదే శివ్ దయాళ్ సింగ్ పాలరాతి సమాధి.

ఈ శివ్ దయాళ్ సింగ్ పాలరాతి సమాధి.. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని ఆగ్రా నగరంలో నిర్మించారు. తాజ్ మహల్‌కు 12 కిలోమీటర్ల దూరంలో స్వామి బాగ్ కాలనీలో ఈ శివ్ దయాళ్ సింగ్ పాలరాతి సమాధిని కట్టారు. రాధాస్వామి అనే ఆధ్యాత్మిక సంప్రదాయానికి పునాది వేసిన శివ్‌ దయాళ్‌ సింగ్‌కు సంబంధించిన పాలరాతి సమాధి ఇప్పుడు తాజ్ మహల్‌కు గట్టి పోటీని ఇస్తోంది. ఈ కట్టడాన్ని చూసేందుకు భవిష్యత్‌లో దేశ, విదేశాల నుంచి భారీగా సందర్శకులు వస్తారని స్థానికులు చెబుతున్నారు.

అయితే ఈ శివ్ దయాళ్ సింగ్ సమాధి నిర్మాణం పూర్తి కావడానికి 100 ఏళ్లు దాటడం గమనార్హం. ఈ సమాధి నిర్మాణ పనులు 1904 లో ప్రారంభమయ్యాయి. అయితే ఆ తర్వాత ఎన్నో అడ్డంకులు, అవాంతరాలు ఎదురై ఆగిపోయాయి. ఆ తర్వాత మళ్లీ 1922 లో తిరిగి నిర్మాణ పనులు ప్రారంభించారు. అప్పటి నుంచి కొద్దికొద్దిగా జరుగుతున్న ఆ నిర్మాణ పనులు.. సుదీర్ఘ కాలంగా సాగుతూ ఇప్పుడు చివరి దశకు వచ్చాయి. ఇంకా ఆ నిర్మాణానికి చిన్న చిన్న పనులు మిగిలి ఉండగా.. ప్రస్తుతం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

రకరకాల నిర్మాణ శైలిలను ఆధారంగా చేసుకుని నిర్మించిన ఈ కట్టడం తాజ్‌ మహల్‌కు గట్టి పోటీ అని నిర్మాణం చేసినవారు చెబుతున్నారు. రాజస్థాన్‌లోని మక్రానా, జోధ్‌పుర్‌ల నుంచి తెచ్చిన పాలరాతితో ఈ నిర్మాణాన్ని ఏకంగా 193 అడుగుల ఎత్తు నిర్మించారు. ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌, కర్ణాటక రాష్ట్రాలతోపాటు వివిధ దేశాలకు చెందిన లక్షలాది మంది రాధాస్వామి సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఇప్పుడు వారంతా ఈ శివ్ దయాళ్ సింగ్ సమాధిని సందర్శించుకునేందుకు వస్తున్నారు. అయితే ఇది తాజ్‌మహల్‌కు పోటీ కాదంటూ కొందరు కొట్టిపారేస్తున్నారు.

bottom of page