top of page
Suresh D

రోడ్డుపై అనుమానాస్పదంగా సంధ్య ఆక్వా బస్సు..


సంధ్య ఆక్వా బస్సు అనుమానాస్పదంగా కనిపించింది. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం కొత్తమూలపేట సెజ్‌ కాలనీలో గత మూడు రోజులుగా సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్సు పరిశ్రమకు చెందిన బస్సు ఉండటం కలకలం రేపింది. బస్సులో అట్టపెట్టెలు ఉండటాన్ని స్థానికులు గుర్తించారు.. పోలీసులకు సమాచారం అందించారు. ఈ నెల 16న విశాఖ పోర్టుకు బ్రెజిల్‌ నుంచి వచ్చిన కంటెయినర్‌లో భారీగా డ్రగ్స్‌ నిల్వలు ఉండటాన్ని గుర్తించడం.. సీబీఐ అధికారులు సంధ్య ఆక్వా పరిశ్రమకు చెందినదిగా నిర్ధారించడం తెలిసిందే. దీంతో రెండురోజుల పాటు సీబీఐ అధికారుల బృందం మూలపేటలో ఉన్న సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్టు పరిశ్రమలో విస్తృత సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలోనే ఆ పరిశ్రమకు చెందిన బస్సు మూడు రోజులుగా ఓ ప్రాంతంలో అనుమానాస్పదంగా కనించింది. స్థానికుల సమాచారంతో కొత్తపల్లి పోలీసులు బస్సు తలుపులు తెరిచి అట్టపెట్టెలను పరిశీలించారు. ఒక్కో పెట్టెలో పరిశ్రమకు చెందిన డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, భారీగా ఓ బ్యాంకుకు చెందిన చెక్‌బుక్కులు ఉన్నట్లు గుర్తించారు. స్థానిక ఎస్సై పరిశ్రమ ప్రతినిధులతో మాట్లాడి బస్సును ఇక్కడ నిలిపిఉంచడానికి గల కారణాలను తెలుసుకున్నారు. మరమ్మతులకు గురవడంతో మూడు రోజులుగా అక్కడే పార్కింగ్‌ చేయాల్సి వచ్చిందని ప్రతినిధులు తెలిపినట్లు ఎస్సై చెప్పారు. తనిఖీల అనంతరం పరిశ్రమ ప్రతినిధులకు బస్సు, రికార్డులను అప్పగించినట్లు వివరించారు.  

bottom of page