సౌత్ కొరియాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం సామ్సంగ్ ఇటీవల వరుసగా స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేస్తోంది. ఓవైపు ప్రీమియం మార్కెట్ను మరోవైపు బడ్జెట్ మార్కెట్ను టార్గెట్ చేసుకొని కొంగొత్త ఫోన్లను తీసుకొస్తున్న సామ్సంగ్ తాజాగా మిడ్ రేంజ్ బడ్జెట్లో ఓ ఆకర్షణీయమైన 5జీ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. ఇంతకీ ఈ ఫోన్లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
సామ్సంగ్ గ్యాలక్సీ ఎఫ్55 పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ను తీసుకొచ్చింది. లెదర్ ఫినిష్తో అదిరిపోయే డిజైన్తో ఈ స్మార్ట్ ఫోన్ను తీసుకొచ్చారు. గ్యాలక్సీ ఎఫ్55 ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 6.67 ఇంచెస్తో ఫుల్ హెచ్డీ+ అమో ఎల్ఈడీ డిస్ప్లేను అందించనున్నారు. 120హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్, 100 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను అందించారు. దీంతో ఎండలో కూడా ఈ ఫోన్ స్క్రీన్ను స్పష్టంగా చూడొచ్చు. ఇక ఈ ఫోన్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 జనరేషన్ 1 ప్రాసెసర్తో పనిచేస్తుంది.
ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేస్తుంది. నాలుగేళ్ల పాటు ఓఎస్ అప్డేట్స్, 5 ఏళ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని సామ్సంగ్ చెబుతోంది. కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్లో 50 మెగాపిక్సెల్స్తో కూడిన రెయిర్ కెమెరా సెటప్ను అందించారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో ఈ కెమెరాను తీసుకొచ్చారు. 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ మ్యాక్రో సెన్సరను ఇచ్చారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50 మెగాపిక్సెల్స్తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.
ఇక ఇందులో 45 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఇక కనెక్టివిటీ విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్లో వైఫై 6, యూఎస్బీ 2.0, బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్సీ వంటి ఫీచర్లను అందించారు. అలాగే ఇందులో ఇన్డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఐపీ 67 రేటింగ్ వాటర్ రెసిస్టెంట్ను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ను మొత్తం 3 వేరియంట్స్లో తీసుకొచ్చారు. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధరను రూ. 26,999, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 29,999, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 32,999గా నిర్ణయించారు. ఇక లాంచింగ్ ఆఫర్లో భాగంగా పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 2వేలు డిస్కౌంట్ పొందొచ్చు.