బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్కు ప్రాణహాని ఉందనే విషయంపై పెద్ద అప్డేట్ వెలుగులోకి వచ్చింది. సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర పన్నినందుకు ఒకరిపై ముంబై సౌత్ సైబర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. కొద్ది రోజుల క్రితం లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్కు చెందిన వ్యక్తి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యూట్యూబ్లో వీడియోను అప్లోడ్ చేశాడు. ఈ వీడియోలో సల్మాన్ఖాన్ను చంపేస్తానంటూ బెదించాడు. దీంతో సూపర్స్టార్ అభిమానులు ఆయన భద్రతపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రీసెంట్ గా సల్మాన్ ఖాన్ కూడా దీనిపై ఓ స్టేట్ మెంట్ ఇస్తూ.. వీటన్నింటితో తాను చాలా విసిగిపోతున్నానని, తనను మళ్లీ మళ్లీ టార్గెట్ చేస్తున్నారని అన్నారు.
ఇక తాజాగా చంపేస్తానని బెదిరింపులకు సంబంధించి సైబర్ పోలీసులు ఐటీ యాక్ట్ 66 (డి)తో పాటు 506 (2), 504, 34 ఐపీసీ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందుకు సంబంధించి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును విచారించేందుకు క్రైమ్ బ్రాంచ్ బృందం రాజస్థాన్ వెళ్లింది. ఈ కేసులో రాజస్థాన్కు చెందిన బన్వరీలాల్ గుర్జార్ (25) అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి ముంబైకి తరలించారు.
ఏప్రిల్ 14న సల్మాన్ ఖాన్పై దాడికి ప్రయత్నించిన విషయం తెలిసిందే. ముంబైలోని సల్మాన్ ఇంటి గెలాక్సీ అపార్ట్మెంట్ వెలుపల ఇద్దరు బైకర్లు కాల్పులు జరిపి పారిపోయారు. మరుసటి రోజే గుజరాత్కు చెందిన ఇద్దరు ముష్కరులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మరో నిందితుడు అనుజ్ థాపన్ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. అయితే అతను కొన్ని రోజుల తర్వాత జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇంకా విచారణ జరుపుతున్నారు.
సల్మాన్ ఖాన్ చివరిగా టైగర్ 3 చిత్రంలో కనిపించాడు. ఆయన సినిమా గతేడాది దీపావళి సందర్భంగా విడుదలైంది. ఇప్పుడు నటుడు తన తదుపరి చిత్రం సికందర్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఆర్. మురగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న, కరీనా కపూర్లు కూడా కనిపించనున్నారు.