top of page
MediaFx

దాన్ని రికార్డు చేయొద్దని కోరినా..ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు..


మైదానంలో ఆటగాళ్ల మధ్య ఏ చిన్న విషయం చోటుచేసుకున్నా.. కెమెరాలు రికార్డు చేస్తున్నాయి. ఈ విషయం లైవ్లో బయటకి వస్తుండటంతో ఆటగాళ్లు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మైదానంలో ఆటగాళ్ల సంభాషణలు రికార్డు చేయడంపై ముంబయి మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఇలాంటి చర్యలు ఆటగాళ్ల గోప్యతకు భంగం కలిగిస్తాయని ఎక్స్(ట్విటర్)లో అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఐపీఎల్ బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్కు ఈ విషయం వివరించినా.. రికార్డ్ చేసి ప్రసారం చేసిందని రోహిత్ మండిపడ్డాడు. ఎక్స్ క్లూజివ్ కంటెంట్ ఇవ్వాలని చేస్తున్న ఇలాంటి ప్రయత్నాలు.. అభిమానులు, క్రికెటర్ల మధ్య బంధాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాయని పేర్కొన్నాడు. లఖ్నవూతో ఇటీవల జరిగిన మ్యాచ్ సందర్భంగా కెమెరామెన్కు ఈ విషయాన్ని తెలిపినట్లు రోహిత్ వెల్లడించాడు. మైదానంలో కోల్కతా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్తో రోహిత్ జరిపిన సంభాషణ ఇటీవల సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అందులో ముంబయి జట్టుతో తన రిలేషన్షిప్ గురించి మాట్లాడుతూ “భాయ్ నాదేముంది.. ఇదే చివరిది” అన్నట్లు వినిపించింది. దీంతో రోహిత్ ఐపీఎలు గుడ్బై చెప్పనున్నట్లు ప్రచారం జరిగింది. చివరికి ఆ వీడియోను కేకేఆర్ సోషల్ మీడియా ఖాతా నుంచి డిలీట్ చేసినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇటీవల లఖ్ నవూతో ఆడిన చివరి లీగ్ మ్యాచ్కు ముందు భారత మాజీ ఆటగాడు ధవళ్ కులకర్ణితో మాట్లాడుతూ రోహిత్ కనిపించాడు. ఈ క్రమంలో కెమెరామెన్ వీడియో తీయడాన్ని గమనించాడు. ఇప్పటికే కోల్కతా కోచ్ అభిషేక్ నాయర్ తో సంభాషణ వైరల్ గా మారిన సంగతి గుర్తుకొచ్చి.. సదరు కెమెరామన్కు రోహిత్ ఓ విజ్ఞప్తి చేశాడు. “బ్రదర్ ప్లీజ్ ఆడియోను క్లోజ్ చేయి. ఇప్పటికే ఒకటి నెట్టింట వైరల్గా మారిపోయింది. దీంతో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి” అని అన్నాడు.

bottom of page