top of page
MediaFx

ఛీ మీరు మనుషులేనా.. నా కూతురి ఏడుపు మీకు తగులుతుంది.. రేణూ దేశాయ్

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ తనపై, తన పిల్లలపై వస్తున్న ట్రోల్స్‌కి గత కొన్ని రోజులుగా గట్టిగా సమాధానమిస్తున్నారు. అయినా సరే కొంతమంది పోకీరీలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఆపడం లేదు. దీంతో తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కామెంట్ బాక్స్ కూడా ఆఫ్ చేశారు రేణూ దేశాయ్. అయితే తాజాగా మరోసారి ఈ ట్రోలర్స్, మీమ్స్ పేజీల అడ్మిన్‌ల గురించి ఓ సుదీర్ఘ పోస్టు పెట్టారు. పవన్ కళ్యాణ్-అన్నా లెజినోవాతో అకీరా, ఆద్య కలిసి తీసుకున్న ఫ్యామిలీ పిక్‌ను షేర్ చేసిన ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డారు రేణూ దేశాయ్. వీళ్లు చేసే ట్రోల్స్ వల్ల ఈరోజు తన కూతురు ఎంతో ఏడ్చిందంటూ రేణూ దేశాయ్ ఎమోషనల్ అయ్యారు. మీకు కుటుంబాలు లేవా అంటూ వారిని ప్రశ్నించారు.

ఆద్య ఏడ్చింది

"అసలు మీకు ఎమోషన్స్ లేవా? ఈ ఫొటోను నేను క్రాప్ చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ జోకులు వేస్తూ ఇష్టమొచ్చినట్లుగా మీమ్స్ క్రియేట్ చేస్తారా? మీకు కూడా కుటుంబం ఉంటుంది గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఉదయం ఒక చెత్త మీమ్ పేజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన తల్లి గురించి జోకులు వేస్తూ పెట్టిన ఓ పోస్ట్ చూసి నా కూతురు ఆద్య ఏడ్చింది. మీరు సెలబ్రెటీలు, రాజకీయ నేతల కుటుంబాలపై జోకులు వేస్తారు. కానీ మీకు కూడా అమ్మ, అక్కాచెల్లెళ్లు, కూతుర్లు ఉంటారు కదా. నిజంగా మనషులు ఇంతలా జంతువుల్లా ఎలా మారిపోతున్నారో అర్థం కావడం లేదు. కేవలం మీ చేతిలో ఇంటర్నెట్ ఉంది కదా అని.. సోషల్ మీడియాలో సెలబ్రెటీల గురించి ఏమైనా పోస్ట్ చేస్తారా?" అంటూ రేణూ దేశాయ్ ఫైర్ అయ్యారు.

"నా కూతురు ఈరోజు ఎంత బాధపడి ఉంటుందో ఒకసారి గుర్తు చేసుకోండి.. ఖచ్చితంగా ఆమె ఏడుపు మీకు తగులుతుంది. ఆ కర్మ మీరు అనుభవిస్తారు. మాపై ట్రోల్స్ చేసిన మీమ్ పేజ్ అడ్మిన్‌లకి ఒక తల్లి ఇచ్చే శాపం ఖచ్చితంగా తగులుతుంది. ఈ పోస్ట్ పెట్టే ముందు ఒక 100 సార్లు నేను ఆలోచించాను. కానీ నా కూతురు పడిన బాధ చూసి పెట్టకుండా ఉండలేకపోయాను." అంటూ రేణూ దేశాయ్ ఆవేదన చెందారు.

కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రేణూ దేశాయ్, తన పిల్లలపై ఇష్టమొచ్చినట్లుగా ట్రోల్స్ చేస్తున్నారు కొంతమంది ఆకతాయిలు. దీనిపై ఓపిక ఉన్నంత వరకూ పోరాడిన రేణూ ఇక వాళ్ల పాపాన వాళ్లని వదిలేద్దామని డిసైడ్ అయ్యారు. కానీ ఈరోజు తన కూతురి కన్నీళ్లకి కారణం అవ్వడంతో తట్టుకోలేక మరోసారి పోస్ట్ పెట్టారు.


bottom of page