తెలంగాణ కాంగ్రెస లో కొత్త రాజకీయం తెర మీదకు వస్తోంది. ఎంపీ అభ్యర్దుల ఎంపికలో సీనియర్ల మార్క్ రాజకీయం కనిపిస్తోంది. నేటితో నామినేషన్ల గడువు ముగుస్తున్న వేళ కాంగ్రెస్ పెండింగ్ లో ఉన్న ముగ్గురు ఎంపీ అభ్యర్దులను ప్రకటించింది. అందులో ఖమ్మం స్థానం కోసం హైకమాండ్ పైన ఒత్తిడి కొనసాగింది. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు లాబీయింగ్ చేసారు. చివరకు పొంగులేటి తన పంతం నెగ్గించుకున్నారు. బంధువుకు సీటు ఇప్పించుకున్నారు.
అనేక తర్జన భర్జనల తరువాత కాంగ్రెస్ నాయకత్వం ఖమ్మం ఎంపీ అభ్యర్దిని ప్రకటించింది. ఖమ్మం ఎంపీ సీటు తమ వారికి ఇప్పించుకొనేందుకు జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు పోటీ పడ్డారు. జిల్లాలో కమ్మసామాజిక వర్గం బలంగా ఉన్న నేపథ్యంలో.. స్థానికంగా ఆ సామాజిక వర్గం నేత రాయల నాగేశ్వర్రావుకు టికెట్ ఇవ్వాలని భట్టివిక్రమార్క ప్రతిపాదించారు. తన సోదరుడు ప్రసాదరెడ్డి కోసం పొంగులేటి శ్రీనివా్సరెడ్డి, తన కుమారుడు యుగంధర్ కోసం మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రయత్నాలు చేశారు. ఈ సీటు వ్యవహారం శిరోభారంగా మారడంతో.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆ బాధ్యతను అధిష్ఠానానికే అప్పగించారు. బీసీ నేత వి.హన్మంతరావు కూడా ఈ సీటు కోసం ప్రయత్నించారు.
భట్టి విక్రమార్కతోపాటుగా రాష్ట్ర ముఖ్య నాయకులు, ఎంపీ రేణుకాచౌదరి, మంత్రి తుమ్మలనాగేశ్వర్రావు, జిల్లా ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకున్న అధిష్ఠానం.. చివరికి రామసహాయం రఘురామరెడ్డి పేరును ఖరారు చేసింది. ఈ సమయంలోనూ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తన పంతం నెగ్గించుకున్నారు. ఆయన వియ్యంకుడు, మాజీ ఎంపీ రామసహాయం సురేందర్రెడ్డి కుమారుడు రఘురామరెడ్డిని ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా అధిష్ఠానం నిర్ణయించింది. ఖమ్మం సీటుకు రామసహాయం రఘురామరెడ్డిని, కరీంనగర్ సీటుకు వెలిచాల రాజేందర్రావును, హైదరాబాద్ స్థానం నుంచి డీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ వలీవుల్లా సమీర్ను అభ్యర్థులుగా నిర్ణయించింది. అదేవిధంగా.. ఖమ్మం-వరంగల్-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం ఉప ఎన్నికల అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పేరును ప్రకటించింది.
మంత్రాంగంలో భాగంగా మంత్రుల కుటుంబ సభ్యులకు సీటు కేటాయించవద్దన్న వాదన ముందుకు రావడంతో.. తన వియ్యంకుడు రామసహాయం సురేందర్రెడ్డి పేరును పొంగులేటి తెరపైకి తెచ్చారు. రఘురామరెడ్డి తండ్రి సురేందర్రెడ్డి కాంగ్రెస్ నుంచి ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేశారు. పొంగులేటి కాంగ్రెస్ లో చేరటం వెనుక సురేందర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పొంగులేటి, సురేందర్రెడ్డి కారణంగా ఖమ్మంలో పలు శాసనసభ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోగలిగింది. ఈ సమీకరణలతో రఘురామరెడ్డి వైపు అధిష్ఠానం మొగ్గుచూపినట్లు స్పష్టమవుతోంది. కాగా.. ఖమ్మం సీటును రెడ్డి సామాజికవర్గానికి కేటాయిస్తే.. కరీంనగర్ను వెలమలకు ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయించింది. దీంతో, ఖమ్మంలో గెలుపు -మెజార్టీ పొంగులేటికి ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది.