పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎలక్షన్స్ లో బిజీగా ఉన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. మరి కొన్ని గంటల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించడం కోసం నేతలంతా జోరుగా ప్రచారం చేస్తున్నారు. మరో వైపు పవన్ కళ్యాణ్ తన ప్రచారంతో దూసుకుపోతున్నారు. అలాగే జనసేనానికి మద్దతు తెలిపేందుకు చాలా మంది సెలబ్రెటీలు పిఠాపురానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోలు, సినిమా ఆర్టిస్ట్ లు పిఠాపురంలో పవన్ కు మద్దతు తెలిపేందుకు ప్రచారం చేస్తున్నారు.
జబర్దస్త్ టీమ్ సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీనులతో పాటు.. మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ కూడా జనసన అధినేత కోసం ప్రచారం చేస్తున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా తన మద్దతు పవన్ కు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు బాబాయ్ కోసం అబ్బాయ్ రంగంలో దిగుతున్నాడు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జనసేనకు మద్దతు తెలిపేందుకు పిఠాపురం చేరుకున్నారు. తన తల్లి సురేఖతో కలిసి రామ్ చరణ్ పిఠాపురం చేరుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా చరణ్ పవన్ కు తన మద్దతు తెలిపాడు. ఇప్పుడు నేరుగా ప్రచారానికి వెళ్లనున్నారు. ముందుగా తన తల్లి సురేఖతో కలిసి పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించనున్నాడు. ఆతర్వాత పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రచారంలో పాల్గొంటాడు రామ్ చరణ్.