భారత్తో 1999లో లాహోర్ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించిందని పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు. కార్గిల్ యుద్ధానికి అప్పటి జనరల్ పర్వేజ్ ముషారఫ్ కారణమని పరోక్షంగా పేర్కొన్నారు. పాక్ తొలి అణు ప్రయోగం జరిగి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ వ్యాఖ్యలను పాక్ ప్రభుత్వ ఛానల్ ప్రసారం చేసింది.
1998 మే 28న పాకిస్థాన్ ఐదు అణుపరీక్షలను నిర్వహించింది. ఆ తరువాత వాజ్పేయి గారు ఇక్కడికొచ్చి లాహోర్ డిక్లరేషన్ ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ ఆ ఒప్పందాన్ని మనం ఉల్లంఘించాం. అది మన తప్పే" అని షరీఫ్ అన్నారు.
లాహోర్ వేదికగా భారత్, పాక్ మధ్య 1999లో కుదిరిన శాంతి ఒప్పందాన్ని లాహోర్ డిక్లరేషన్ అంటారు. ఈ ఒప్పందం తర్వాత కొద్ది నెలల్లోనే నవాజ్ షరీఫ్ జమ్మూకశ్మీర్లో కార్గిల్ చొరబాట్లకు తెరతీశారు. ఫలితంగా యుద్ధంలో పాక్ ఓడిపోయింది.
అణు పరీక్షలు నిర్వహించకుండా ఉండేందుకు అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ పాక్ కు 5 బిలియన్ల ఆర్థిక సాయం ఇస్తానని ఆశ చూపినట్టు నవాజ్ షరీఫ్ అన్నారు. కానీ తాను ఆ ఆఫర్ తిరస్కరించినట్టు చెప్పారు. తన స్థానంలో ఇమ్రాన్ ఖాన్ ఉంటే బిల్ క్లింటన్ ప్రతిపాదనను అంగీకరించేవారని అభిప్రాయపడ్డారు. తాను పదవీచ్ఛితుడిని కావడానికి ఐఎస్ఐ కుట్ర పన్నిందని, ఇమ్రాన్ ఖాన్ను ప్రధాని చేయడానికే ఈ కుట్ర అని తెలిపారు.