top of page
MediaFx

రాష్ట్రాన్ని షేక్ చేస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ పవర్ కట్..!


ఉస్మానియా యూనివర్సిటీలో కరెంటు కోత.. రాష్ట్రాన్నే షేక్‌ చేసింది. విద్యార్థులకు వార్డెన్‌ నోటీసులపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. దీన్ని సరిదిద్దుకునే పనిలో పడింది తెలంగాణ ప్రభుత్వం. వెంటనే వివరణ కోరుతూ వార్డెన్‌కు నోటీసులు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అసలు అధికార విపక్షాల ఫైట్‌ ఎలా ఉందో చూద్దాం.

ఉస్మానియాలో కరెంటు కోతలున్నాయి. నీటి ఎద్దడి ఎదురవుతోంది. దయచేసి హాస్టల్స్‌ ఖాళీ చేసేయండి. ఇది ఓయూ చీఫ్‌ వార్డెన్‌ విద్యార్థులకు ఇచ్చిన నోటీసు. దీంతో ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్‌ అంతా ధర్నాకు దిగారు. తాము కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్‌ అవుతున్నాం, కాబట్టి ప్రభుత్వం తమ డిమాండ్‌ను పట్టించుకోవాలని ఆరోజు రాత్రే ధర్నా చేశారు. దీంతో దిగొచ్చిన ప్రభుత్వం వార్డన్‌కు నోటీసులు జారీ చేసింది. విద్యార్థులు ఎక్కడకు వెళ్లక్కర్లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. డిప్యూటీ సీఎం, విద్యుత్‌శాఖా మంత్రి కూడా అయిన భట్టి విక్రమార్క.. అసలు రాష్ట్రంలో కరెంటు కోతల్లేవన్నారు. ఆ వార్డన్‌కు షోకాజ్‌ నోటీసులు ఇచ్చామన్నారు భట్టి విక్రమార్క.

అసలు ఈ విషయం వెలుగులోకి రావడానికి రీజన్‌ ఉంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓయూలో జరుగుతున్న విషయాన్ని సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఆతర్వాత ప్రభుత్వం స్పందించింది. అయితే ఖమ్మం సభలో మాట్లాడిన బీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్.. ఈ ప్రభుత్వంలో కరెంటు కోతలు దారుణంగా ఉన్నాయని ఆరోపించారు. తాను ట్వీట్‌ చేశాను కాబట్టే వార్డన్‌కు నోటీసులు ఇచ్చారన్నారు కేసీఆర్‌.

మరోవైపు క్యాంపస్ లోని సబ్ స్టేషన్ నుంచి రెండు ప్రత్యేక 11kv ఫీడర్ల ద్వారా నిరంతరం యూనివర్సిటీకి విద్యుత్ సరఫరా జరిగిందన్న విషయం మీటర్ రీడింగ్ ల ద్వారా స్పష్టమైనట్టు అధికారులు వారి నివేదించారు. వాస్తవాలు ధ్రువీకరించుకోకుండా తప్పుడు ప్రకటన చేసిన చీఫ్ వార్డెన్ కు యూనివర్సిటీ రిజిస్టార్ ద్వారా షోకాస్ నోటీసు జారీ చేశారు. మరి ఈ వివాదం ఇక్కడితో ముగుస్తుందా? కంటిన్యూ అవుతుందో చూడాలి..!


bottom of page