top of page

ప్రేమ అంటూ.. పెళ్లి అంటూ.. యువకుల వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య 💔



నిర్భయ లాంటి ఎన్ని చట్టాలు ఉన్నా.. ఎన్ని శిక్షలు విధించినా.. ప్రేమోన్మాదులు మాత్రం ఇంకా రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా, నల్లగొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఒకే వీధిలో ఉండే ఇద్దరు యువకులు ఓ యువతిని దారుణంగా హింసించారు. ఒకరు పెళ్లి చేసుకోవాలని, మరొకరు ప్రేమించాలని వేధించారు. తాము చెప్పినట్లుగా వినకపోతే వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఫొటోలను పెడతామని బెదిరించారు. ఈ ప్రేమోన్మాదుల వేధింపులు తాళలేక చివరకు ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది.



నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం చింతలగూడెం గ్రామానికి చెందిన కొత్త రామలింగం రజిత దంపతులకు కుమారుడు, కుమార్తె కల్యాణి (18) ఉన్నారు. కల్యాణి పాలిటెక్నిక్ పూర్తి చేసి హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేసేది. కొంతకాలంగా ఆమె ఇంటి వద్దే ఉంటోంది. ఒకే గ్రామానికి చెందిన ఆరూరి శివ, కొమ్మనబోయిన మధులు స్థానికంగా ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. ఒకే ఊరు కావడంతో ఆరూరి శివ, కొమ్మనబోయిన మధులతో కల్యాణికి పరిచయం ఉంది.



శివ, మధులు ఇద్దరూ కల్యాణిని ఇష్టపడుతూ, తరచూ ఫోన్లు చేయడం ప్రారంభించారు. ఒకే ఊరు కావడంతో ఉన్న పరిచయాన్ని ఆసరాగా చేసుకుని తనను ప్రేమించాలని శివ, తనను పెళ్లి చేసుకోవాలని మధులు అడుగుతున్నారు. వీరిద్దరి ప్రేమ, పెళ్లి విషయాన్ని కళ్యాణి నిరాకరించింది. వారితో మాట్లాడడం కూడా బంద్ చేసింది. దీంతో శివ మధులిద్దరూ వాట్సాప్‌లో ఆమె డీపీగా (డిస్ప్లే పిక్చర్) పెట్టుకున్న ఫొటోలను తీసుకుని వాటిని తమ వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో స్టేటస్‌గా పెడతామని బెదిరించారు. చెప్పినట్లు వినాలంటూ పదే పదే టార్చర్ పెట్టడంతో వేధింపులు తాళలేక కల్యాణీ ఈ నెల 6వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులు కళ్యాణిని మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆ తర్వాత నల్లగొండలో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ కళ్యాణి మృతి చెందింది.



తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. తమ కుమార్తె మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని తల్లి రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ గ్రామస్తుల పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. తన ఆత్మహత్యకు కారకులు శివ, మధులేనని కళ్యాణి జడ్జికి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొంది. కళ్యాణి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని, నిందితులు శివ, మధులు పరారీలో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page