నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ 2న ఏపీలో, జూన్ 10 నుంచి తెలంగాణలో విస్తరిస్తాయని వాతావరణశాఖ తెలిపింది. వేసవి ఎండల నుంచి ఉపశమనం కలిగిస్తూ నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయి. 2, 3 రోజుల్లో మరింత విస్తరించేందుకు అవకాశాలు ఉన్నాయంటూ విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. జూన్ 2 నుంచి ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
ఇప్పటికే కేరళ తీరాన్ని తాకిన నైరుతీ రుతుపవనాలు ముందుకు విస్తరిస్తున్నాయి. రుతుపవనాల ప్రభావంతో భారత భూభాగంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో తొలకరి జల్లులు కురిసేందుకు సిద్ధమవుతున్నాయి. అన్ని అనుకూలిస్తే జూన్ ఫస్ట్ వీక్లోనే రాయలసీమలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని అంచనా వేస్తున్నారు.
తెలంగాణ రైతులకు హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. జూన్ 10లోగా నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. రుతుపవనాలు రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్కు, జూన్ 10లోగా తెలంగాణకు చేరుకుంటాయని వాతావరణశాఖ అధికారి తెలిపారు. జూన్ 1 నుంచి మూడురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.