2014లో ప్రజలకు తనపై ఉన్న నమ్మకం 2019 నాటికి విశ్వాసంగా మారిపోయిందని, 2024 వచ్చేసరికి ఆ విశ్వాసం గ్యారెంటీగా మారిపోయిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పదేళ్ల పాలనా అనుభవంతో ఏది సాధ్యమో, ఏది అసాధ్యమో తనకు స్పష్టంగా తెలిసిందని టీవీ9 నెట్వర్క్ ఫైవ్ ఎడిటర్స్ ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ తెలిపారు.
గ్యారెంటీలు ఇవ్వాలంటే పెద్ద తపస్సు చేయాలని, మాట్లాడిన ప్రతీ మాట గ్యారెంటీగా ఉండాలని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ప్రజల కోసం తాను కష్టపడుతున్నానంటే వారు నమ్మారని అన్నారు. చెప్పింది తాను చేసి చూపిస్తానని తాను గాలి మాటలు చెప్పనని, మోదీ తెలిపారు.
అవినీతిలో పతకాలు ఇస్తే తెలంగాణ కాంగ్రెస్ సర్కారుకు గోల్డ్ మెడల్, అంతకు ముందున్న బీఆర్ఎస్ సర్కారుకు సిల్వర్ మెడల్ వస్దుందని ప్రధాని మోదీ అన్నారు. ట్రిపుల్ ఆర్ సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచవ్యాప్తమైన చోట ఇప్పుడు ఆర్ఆర్ ట్యాక్స్తో జనాల్ని పీడిస్తున్నారని మోదీ తెలిపారు.
ఏపీ ప్రజల్లో మార్పు మూడ్ కనిపిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. చిలకలూరిపేట సభలో ఆ విషయాన్ని తాను స్పష్టంగా చూడగలిగానని తెలిపారు. చాలా కాలం తర్వాత ఆంధ్రప్రదేశ్లో అంతటి భారీ ర్యాలీ జరిగిందని అన్నారు.
మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ప్రధాని మోదీ తెలిపారు. టీవీ నైన్ నెట్వర్క్ ఫైవ్ ఎడిటర్స్ ఇంటర్వ్యూలో ప్రధాని దేశ భూత, వర్తమాన, భవిష్యత్ రాజకీయాలపై మనస్సు విప్పి మాట్లాడారు మతం ఆధారంగా రిజర్వేషన్లపై రాజ్యాంగ సభలో సుదీర్ఘ చర్చ జరిగిందని గుర్తు చేశారు. ఏకాభిప్రాయం ద్వారానే నాడు మత ఆధారిత రిజర్వేషన్లు వద్దనే నిర్ణయం తీసుకున్నారని మోదీ అన్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయని ప్రధాని మోదీ కుండబద్ధలు కొట్టినట్టు తెలిపారు. రెండు పార్టీలు ఒకదానికి ఒకటి కవర్ చేసుకుంటున్నాయని అన్నారు. చెరో వైపు లాగుతున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ – పగ్గాలు బీజేపీ చేతిలో పెట్టడం ఖాయమని మోదీ వెల్లడించారు.
తన మూడో హయాంలో తొలి వంద రోజుల్లోనే ఒక మంచి పనిచేయబోతున్నానని ప్రధాని మోదీ వెల్లడించారు. రాజ్యాంగ రచన జరిగి 75 ఏళ్లు అయిన సందర్భంగా ఏడాది పాటు దేశవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహిస్తామని ప్రకటించారు. హక్కుల గురించి ఎంత చర్చ జరుగుతుందో అదే స్థాయిలో బాధ్యతలపై కూడా చర్చ జరగాలని తాను కోరుకుంటున్నానని ప్రధాని తెలిపారు.
పొత్తులనేవి ఎన్నికల రాజకీయాలకే పరిమితం చేయరాదని ప్రధాని మోదీ అన్నారు. దేశంలోని ప్రాంతీయ రాజకీయ ఆకాంక్షలకు సంపూర్ణ గౌరవం దక్కాలన్నది తమ అభిమతమని స్పష్టం చేశారు. ఎవరు తమతో వచ్చినా, రాకపోయినా జాతీయ రాజకీయాల్లో ఉండే పార్టీలు, అవి ఎంత పెద్దవైనా ప్రాంతీయ ఆకాంక్షలకు విలువ ఇవ్వాలని మోదీ తెలిపారు.