top of page
MediaFx

కవిత కేసులో నేడు కీలకం..


ఎమ్మెల్సీ కవిత కేసులో నేడు కీలకం కానుంది. ఢిల్లీ లిక్కర్‌ కేసులో అరెస్ట్‌ అయిన ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ.. నేటితో ముగియనుంది. దీంతో కవితను ఢిల్లీలోని రౌస్‌ ఎవెన్యూ కోర్టులో నేడు ప్రవేశపెట్టనున్నారు ఈడీ అధికారులు. అలాగే కవిత వేసిన బెయిల్‌ పిటిషన్‌ కూడా నేడు విచారణకు రానుంది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని ఇప్పటికే ఈడీని ఆదేశించింది రౌస్ అవెన్యూ కోర్టు. మరో నాలుగు రోజులు కవితను ఈడీ కస్టడీ కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు బెయిల్‌ పిటిషన్‌పై కూడా కోర్టులో నేడు వాదనలు వినిపించనున్నారు కవిత తరఫు న్యాయవాదులు. దీంతో కవితకు బెయిల్‌ వస్తుందా? రాదా అనేది ఆసక్తికరంగా మారింది.

ఢిల్లీ లిక్కర్‌ స్కాం పాలసీలో కేజ్రీవాల్‌, కవిత ఇద్దరూ ప్రధాన సూత్రధారులే అని ఈడీ అధికారులు చెబుతున్నారు. అందులో భాగంగానే వీరిద్దరినీ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. లిక్కర్‌ స్కాంలో 100కోట్ల ముడుపులు తీసుకుని మద్యం విధానాన్ని సౌత్‌ గ్రూపునకు అనుకూలంగా మార్చారని ఈడీ ఆరోపణలు చేస్తోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎమ్మెల్సీ కవిత నడిపించారని ఈడీ చార్జ్‌షీట్‌లో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల అరెస్ట్‌ చేసిన సీఎం కేజ్రీవాల్‌తో కలిసి కవితని ప్రశ్నించేందుకు మరో నాలుగు రోజుల పాటు కస్టడీ కావాలని ఈడీ కోర్టులో వాదించే అవకాశం ఉంది.

ఇక కోర్టు అనుమతితో కవితను రెండు విడతల్లో మొత్తం పదిరోజుల పాటు కస్టడీకి తీసుకున్న ఈడీ.. పలు అంశాలపై ఆమెను విచారించింది. నేరపూరిత సొమ్మును ఎలా ఉపయోగించారు? ఎక్కడ నుండి ఎక్కడికి తరలించారు? ఇందులో మేకా శరణ్ పాత్ర ఏంటి? అనే అంశాలపై సమాధానం రాబట్టే ప్రయత్నం చేశారు ఈడీ అధికారులు. అలాగే ఇప్పటికే స్వాధీనం చేసుకున్న ఫోన్లలో కీలక ఆధారాలను కూడా సేకరించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో హైదరాబాద్‌లోని కవిత బంధువుల ఇళ్లలోనూ ఈడీ సోదాలు జరిపింది. కవిత ఆడపడుచు అఖిల, మేనల్లుడు మేక శరణ్‌ నివాసాల్లో తనిఖీలు సాగాయి. ఆడపడుచు అఖిల, మేనల్లుడు శరణ్‌ ద్వారా కవిత లావాదేవీలు జరిపినట్టు ఈడీ అనుమానిస్తోంది. ముడుపుల చెల్లింపులో శరణ్‌దే కీలక పాత్రగా భావిస్తున్నారు ఈడీ అధికారులు.అయితే తమ విచారణకు కవిత సహకరించడం లేదని ఈడీ చెబుతోంది.కవిత మాత్రం ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ అడుగుతున్నారని.. తనపై కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా కేసులు పెట్టిందని ఆరోపిస్తున్నారు. ఇవాళ్టి విచారణలో కూడా ఇవే అంశాలను కవిత కోర్టుకు వివరించే అవకాశం ఉంది. 2022లో ఢిల్లీ లిక్కర్‌ కేసులు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఈడీ, సీబీఐ వేసే ప్రతి స్టెప్.. తీసుకునే ప్రతి నిర్ణయం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులతో పాటు అనేక మంది ప్రముఖలను అరెస్ట్ చేశారు.


bottom of page