ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు హాజరయ్యే ఫ్యాషన్ ఈవెంట్ మెట్ గాలా 2024 న్యూయార్క్ వేదికగా జరిగిన సంగతి తెలిసిందే. మన దేశం నుంచే కాక.. విదేశాలకు చెందిన సెలబ్రిటీలు, సినీ తారలు గాలా రెడ్ కార్పెట్ మీద హోయలు పోవడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది మెట్ గాలా ఈవెంట్లో చీర కట్టులో దర్శనం ఇచ్చి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్. సోషల్ మీడియా అంతా ఆమె ధరించిన చీర గురించే రచ్చ. అందమైన చీరలో అంతకంటే అందంగా కనిపించి.. చందమామతో పోటీ పడింది ఆలియా భట్. ఇక ఈ ఈవెంట్లో సినిమా తారలు మాత్రమే బిజినెస్ ప్రముఖులు కూడా హాజరవుతుంటారు. దానిలో భాగంగానే ఈషా అంబానీ.. ఈ షోలో తళుక్కున మెరిసింది. ఇక వీరిద్దరితో పాటు మరో భారతీయురాలు.. అందునా తెలుగు మహిళ గాలాలో సందడి చేసింది. ఆమె లుక్, దాని కోసం చేసిన ఖర్చు ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. ఆ వివరాలు..
మెట్ గాలాలో మెరిసింది సుధారెడ్డి. ఇంతకు ఎవరీమె అంటే.. భారతీయ వ్యాపారవేత్త, మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ గ్రూప్ డైరెక్టర్, మేఘా కృష్ణారెడ్డి భార్య. సుధారెడ్డి మెట్గాలా ఈవెంట్లో పాల్గొనడం ఇది రెండో సారి. ఇక ఈ ఏడాది గాలాలో వైట్ డ్రెస్లో వెన్నెలమ్మలా మెరిసింది సుధారెడ్డి. ఇక ఆమె ధరించిన డ్రెస్ కన్నా.. అందుకోసం ఆమె చేసిన ఖర్చు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారింది.
గాలా ఈవెంట్ కోసం ఆమె ఏకంగా 10 మిలియన్ డాలర్లు అంటే.. మన కరెన్సీలో చెప్పాలంటే 83 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఈసారి ఆమె గాలాలో తరుణ్ తహ్లియాని డిజైన్ చేసిన దుస్తులు ధరించారు. దీంతో పాటు 180 క్యారెట్ల 30 సాలిటైర్లతో కూడిన నెక్లెస్ను ధరించి గ్రాండ్ లుక్లో మెరిసింది. సుధా రెడ్డి వద్ద ఉన్న పాతకాలపు చానెల్ బ్యాగ్ విలువ 33 లక్షలు. సుధా రెడ్డి పూర్తి లుక్ కోసం దాదాపు 10 మిలియన్లు అంటే 83 కోట్లు ఖర్చు చేసినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.