మణిపూర్లో మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజా ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 25మంది గాయపడ్డారు.
మణిపూర్లో మరోమారు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. చూరచంద్పూర్ జిల్లాలో భద్రతా దళాలు- స్థానికుల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో 25మంది గాయపడ్డారు. ఓ స్థానిక హెడ్ కానిస్టేబుల్.. సాయుధులతో సెల్ఫీ దిగడం, అతడిపై సస్పెన్షన్ వేటు పడటం.. ఈ హింసాత్మక ఘటనకు కారణం!
మణిపూర్లో మళ్లీ ఉద్రిక్తత..!
మణిపూర్లోని విలేజ్ డిఫెన్స్ వాలంటీర్లు, సాయుధ దళాలు ఉండే ఓ బంకర్ వద్దకు వెళ్లాడు సియంలాల్పౌల్ అనే హెడ్ కానిస్టేబుల్. వారితో కలిసి సెల్ఫీ దిగాడు. ఈ ఫొటో.. సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఫలితంగా.. అతడిపై పోలీసు అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. అతడిని తిరిగి ఉద్యోగంలో చేర్చుకోవాలని.. స్థానికులు నిరసనలు చేపట్టారు. చూరచంద్పూర్లోని ఎస్పీ కార్యాలయాన్ని చుట్టుముట్టారు.
నిరసనలు అదుపు తప్పాయి. నిరసనకారులు ఓ బస్సుకు నిప్పంటించారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం బయట వాహనాలకు మంటలు పెట్టారు. పరిస్థితిని అదుపు చేసేందుకు భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు.
మరోవైపు.. మణిపూర్ హింసాత్మక ఘటన నేపథ్యంలో చూరచంద్పూర్ జిల్లావ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది ప్రభుత్వం.
"ఫిబ్రవరి 14న.. సంబంధిత హెడ్ కానిస్టేబుల్ సాయుధులతో కలిసి వీడియో చేశాడు. అది వైరల్గా మారింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాము. ప్రస్తుతానికి సస్పెండ్ చేశాము," అని చూరచంద్పూర్ ఎస్పీ శివానంద్ సుర్వె తెలిపారు.
అయితే.. హెడ్ కానిస్టేబుల్ని అన్యాయంగా విధుల నుంచి తప్పించారని స్థానికులు ఆందోళన చేస్తున్నారు. ఆయనపై వేసిన సస్పెన్ష్ని వెనక్కి తీసుకోవాలని, అప్పటి వరకు ఆందోళనలు కొనసాగిస్తామని తేల్చి చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో కుకీ తెగ- పోలీసుల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తామ గ్రామాలపై పోలీసులు కావాలనే దాడి చేస్తున్నారని కుకీ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలను పోలీసులు తిప్పి కొట్టారు. సాయుధులతో కుకీ ప్రజలు చేతులు కలుపుతున్నారని అంటున్నారు.
కొంతమంది సాయుధులు.. తమని తాము 'విలేజ్ డిఫెన్స్ వాలంటీర్లు'గా పిలుచుకుంటున్నారు. అయితే.. వీరిలో వీరికే గొడవలు కనిపిస్తున్నాయి. ఒక వర్గం వారు.. మరో వర్గం వారిపై దాడులు చేసుకుంటున్నారు. మైతీ- కుకి వర్గాల మధ్యో తీవ్ర విభేదాలతో ఇప్పటికే మణిపూర్లో ఉద్రిక్తత కొనసాగుతున్న తరుణంలో.. తాజా పరిణామాలు మరింత తలనొప్పిగా మారాయి.
గతేడాది మే నెలలో కుకి- మైతీ తెగల మధ్య మణిపూర్లో ఉద్రిక్తత తీవ్రస్థాయికి చేరింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పరిస్థితులు ఉద్రిక్తంగానే ఉన్నాయి. ఇప్పటివరకు 180మంది మరణించారు. 50వేల మందిపై నిరసనల ప్రభావం పడింది.💬🚨
Comments