ఈశాన్య రాష్ట్రం మణిపూర్ భారీ వరదలతో అల్లాడుతోంది. రాజధాని ఇంఫాల్లో జనజీవితం స్తంభించింది. నదులు ఉప్పొంగి ప్రవహించడంతో వందలాది ఇళ్లలోకి వరదనీరు చేరింది. రెమాల్ తుఫాన్ సృష్టించిన బీభత్సం నుంచి తేరుకోలేకపోతున్న ఈశాన్య రాష్ట్రాల్లో మణిపూర్లో పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. వేలాది మంది నిరాశ్రయులుగా మారారు. వర్షం తగ్గినప్పటికీ ప్రజలు ఇంకా రిలీఫ్ క్యాంప్ల్లోనే ఉన్నారు. నంబూరి నదితో పాటు ఇంఫాల్ నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి.
సేనాపతి జిల్లా వకో గ్రామంలో వంతెన కొట్టుకుపోవడంతో ఆ గ్రామం ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. మణిపూర్లోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఇంఫాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కోర్టులు, జడ్జిల నివాసాల్లలోకి కూడా వరదనీరు ప్రవేశించింది. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మణిపూర్ గ్రామీణ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా అపార నష్టం జరిగింది. వందలాది ఇళ్లు కుప్పకూలాయి. కొన్నిచోట్ల ప్రాణనష్టం కూడా జరిగింది.మణిపూర్ వరదలపై కేంద్రం అప్రమత్తమై, రాష్ట్రానికి అన్ని విధాలా సహాయం చేస్తామని భరోసా ఇచ్చింది.