లెటర్బాక్స్డ్ అనేది సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. అత్యంత ప్రజాదరణ పొందిన సినిమాలను చర్చించడానికి, రేట్ చేయడానికి మరియు సమీక్షించడానికి ఈ ప్లాట్ఫారమ్ ఉపయోగపడుతుంది. ఇటీవల లెటర్బాక్స్డ్ లో అత్యధిక అభిమానుల ఆదరణ చూరగొన్న టాప్ 100 చిత్రాల జాబితాను ప్రకటించింది, ఇది 2024 వరకు సంవత్సరానికి అత్యధిక అభిమానుల నిష్పత్తితో ర్యాంక్ చేయబడింది.
ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఈ 100 చిత్రాలలో 4 తెలుగు చిత్ర పరిశ్రమకు చెందినవి మరియు అభిమానుల నుండి అపారమైన ప్రేమను పొందినవి కావడం విశేషం. ఈ చిత్రాలలో అతడు (42వ ర్యాంక్), జెర్సీ (57వ ర్యాంక్), సాగర సంగమం (75వ ర్యాంక్), ఖలేజా (85వ ర్యాంక్) అందుకున్నాయి. ముఖ్యంగా, వీటిలో రెండు చిత్రాలలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించారు, మరియు మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ రెండింటికీ దర్శకత్వం వహించారు.
దీని ద్వారా మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ అని మరోసారి రుజువైంది. బాక్సాఫీస్ వద్ద అతడు మంచి హిట్ అయినా ఖలేజా మాత్రం ఆకట్టుకోలేదు. అయినప్పటికీ కూడా ఇవి టివిలో ప్రసారం అయిన ప్రతి సారి మంచి రేటింగ్స్ అందుకుంటుంటాయి. ఇక తాజాగా మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన గుంటూరు కారం థియేటర్స్ లో మంచి విజయం అందుకోగా అనంతరం ఓటిటి ప్లాట్ఫారమ్ నెట్ఫ్లిక్స్లో విడుదలై మరింత గణనీయమైన ఆదరణ సంపాదించుకుంది. భవిష్యత్తులో మరొకసారి ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్లో ఆకట్టుకునే మూవీ రావాలని ఫ్యాన్స్, ఆడియన్స్ కోరుతున్నారు.