సినిమా తారలు వ్యాపారాలు చేయడం సర్వసాధారణమైన విషయం. కొందరు ఇతర వ్యాపారాలు చేస్తే మరికొందరు మాత్రం సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన బిజినెస్లను రన్ చేస్తుంటారు. ఒకప్పుడు సినిమా తారలు ప్రొడక్షన్స్ హౌజ్ను ఎక్కువగా రన్ చేసే వారు. కానీ ప్రస్తుతం సినిమా థియేటర్ల వైపు హీరోలు అడుగులు వేస్తున్నారు. మల్లీప్లెక్స్ కల్చర్ విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో చాలా మంది ఈ రంగంలో అడుగుపెడుతున్నారు.
ముఖ్యంగా చిన్నచిన్న పట్టణాల్లో కూడా మల్టీ ప్లెక్సులకు ఆదరణ పెరుగుతోంది. దీంతో హీరోలు తమ మల్టీప్లెక్స్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఇందులో మొదటి వరుసలో ఉంటారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఏఎమ్బీ పేరుతో హైదరాబాద్లోని గచ్చిబౌలిలో మహేష్ తొలి మల్టీప్లెక్స్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. భారీ స్క్రీన్లతో ఏర్పాటు చేసిన ఈ మల్టీప్లెక్స్ మంచి సక్సెస్ను అందుకుంది. ఇదిలా ఉంటే తాజాగా మహేష్ ఏఎంబీని విస్తరించే పనిలో పడ్డారు. ఇందులో భాగంగానే మరో పట్టణంలో కూడా ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
హైదరాబాద్లో ఏషియన్ సంస్థలో కలిసి గచ్చిబౌలిలో మల్టీప్లెక్స్ రన్ చేస్తున్న మహేష్ త్వరలోనే ఆర్టీసీ క్రాస్రోడ్లో కూడా మరో మల్టీప్లెక్స్ ప్రారంభించనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే తాజాగా మాత్రం మహేష్ ఏఎంబీని బెంగళూరుకు విస్తరించినట్లు అధికారిక ప్రకటన వచ్చింది. దీనికి సంబంధించి ఏషియన్ సంస్థ అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించింది. త్వరలోనే ఈ మల్టీప్లెక్స్ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.