top of page
MediaFx

లోక్‌సభ ఎన్నికల తుది ఘట్టం.. జూన్‌ 1న 8 రాష్ట్రాల్లో 57 స్థానాల్లో పోలింగ్‌


లోక్‌సభ ఎన్నికల ఘట్టం క్లైమాక్స్‌కు చేరింది. మొత్తానికి ఓ పనైపోయింది. రెండు నెలలపాటు విరామం లేకుండా మోగిన మైకులు..మూగబోయాయి. ప్రత్యర్థులపై ఆరోపణలు, ప్రత్యారోపణలతో విరుచుకుపడ్డ నేతలు. ఎట్టకేలకు విశ్రమించారు. తుదిదశ పోలింగ్‌కు ప్రచార గడువు ముగియడంతో అగ్రనేతలు..ఆధ్యాత్మిక బాట పట్టారు.

తుది దశ ఓటింగ్ జూన్ 1వ తేదీన 8 రాష్ట్రాల్లో 57 స్థానాల్లో జరుగుతుంది. మొత్తం 904 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పంజాబ్‌ నుంచి అత్యధికంగా 328 మంది, యూపీ నుంచి 144 మంది, బిహార్‌ నుంచి 134 మంది పోటీలో ఉన్నారు. ప్రధాని మోదీ బరిలో ఉన్న వారణాసి నియోజకవర్గంలో ఓటింగ్ జరగనుంది. వారణాసి ఓటర్లకు ప్రత్యేక సందేశం ఇచ్చారు మోదీ.

తుదివిడత ఎన్నికల బరిలో వారణాసిలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ కీలక నేత అజయ్ రాయ్ పోటీ చేస్తున్నారు. సినీ నటి కంగనా రనౌత్ (బీజేపీ) మరియు విక్రమాదిత్య సింగ్ (కాంగ్రెస్) మండి నియోజకవర్గంలో పోటీపడుతున్నారు. గోరఖ్‌పూర్‌లో రవికిషన్ (బీజేపీ), కాజల్‌ నిషాద్‌ (సమాజ్‌వాదీ), హమీర్‌పూర్‌లో అనురాగ్‌ ఠాకూర్‌ (బీజేపీ), సత్యపాల్‌ సింగ్‌ (కాంగ్రెస్‌) బరిలో ఉన్నారు. డైమండ్ హార్బర్‌లో అభిషేక్ బెనర్జీ (టీఎంసీ), అభిజిత్ దాస్ (బీజేపీ) పోటీ చేస్తున్నారు. పాటలీపుత్రలో మిసా భారతి (లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె) పోటీ చేస్తున్నారు.

ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడుతాయి. ప్రధాని మోదీ హ్యాట్రిక్‌ ఖాయమని చెబుతున్నారు. ఈ తుదిదశలో మొత్తం 598 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

ఎన్నికల ప్రచారం ముగియడంతో పార్టీలు పోల్‌ మేనేజ్‌మెంట్‌పై దృష్టి పెట్టాయి. యూపీ, బిహార్‌, జార్ఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రధానంగా పోటీ ఉంది. ఒడిశా, పంజాబ్‌, బెంగాల్‌లో త్రిముఖ పోటీ ఉంది. బెంగాల్‌లో ప్రతిసారి హింస కారణంగా ఈసీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రధానమంత్రి మోదీ పంజాబ్‌లో హోషియార్‌పూర్‌లో ప్రచారాన్ని ముగించారు. 75 రోజులపాటు 200 సభల్లో పాల్గొన్నారు.

తుదివిడతలో ఎంత పోలింగ్‌ శాతం నమోదవుతుందన్న ఉత్కంఠ నెలకొంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్‌ జరుగుతుంది. 6 దశల్లో పోలింగ్‌ శాతం మిగతా వివరాలు క్లారిటీ రాలేదు. ఈసీ.. చివరి దశ ఎన్నికలను కూడా ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది.

శనివారం పోలింగ్‌ పూర్తి కాగానే వెలువడే ఎగ్జిట్‌ పోల్స్‌పై ఉత్కంఠ నెలకొంది. బీజేపీ నేతలు 400 సీట్లు ఖాయమని, మోదీ మూడోసారి ప్రధాని కాబోతున్నారని చెబుతున్నారు. కానీ విపక్షాలు ఉత్తరాదిలో బీజేపీ సీట్లు తగ్గుతాయని అంటున్నాయి. మోదీ సుడిగాలి ప్రచారం చేశారు. కాంగ్రెస్‌ ప్రచారాన్ని రాహుల్‌, ప్రియాంక గాంధీ ముందుండి నడిపించారు.


bottom of page