top of page

ఆ నియోజకవర్గం నుంచే లోక్‌సభ బరిలో రాహుల్ గాంధీ..🗳️


ఉత్తర్‌ప్రదేశ్‌లో గాంధీ-నెహ్రూ కుటుంబం కంచుకోట అమేఠీకి బీటలువారిన తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్మించుకుంటున్న కొత్త కోట వాయనాడ్. గత సార్వత్రిక ఎన్నికల్లో 4.31 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందిన ఈ నియోజకవర్గం నుంచే ఈసారి మళ్లీ పోటీ చేస్తున్నారు. రెండవ విడతలో భాగంగా ఏప్రిల్ 26న పోలింగ్ జరగనున్న ఈ స్థానం కోసం బుధవారం ఏప్రిల్ 3వ తేదీన నామినేషన్ దాఖలు చేశారు. దశాబ్దాలుగా పార్టీకి కంచుకోటగా నిలిచిన అమేఠీని వదులుకుని మరీ ఈ ఒక్క చోట నుంచే పోటీ చేస్తుండడంతో రాజకీయ ప్రత్యర్థులు సైతం ఈ సీటుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వాయనాడ్‌ను కూడా మరో అమేఠీలా మార్చి రాహుల్ గాంధీ విజయావకాశాలను దెబ్బతీయాలని చూస్తున్నారు. పైగా దేశమంతటా మిత్రపక్షంగా ఉన్న కమ్యూనిస్టులు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బద్ద విరోధులుగా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా భారతీయ జనతా పార్టీ సైతం గట్టి పోటీ ఇచ్చేందుకు పావులు కదుపుతోంది. దీంతో ఈసారి గెలుపు సునాయాసం కాదని, గెలవాలంటే కష్టపడాల్సిందేనని  సంకేతాలు వినిపిస్తున్నాయి .

bottom of page