top of page
MediaFx

దశాబ్దాలుగా మూతపడిన కోలారు బంగారు గనుల్లో తవ్వకాలు పునఃప్రారంభం

కర్ణాటక ప్రభుత్వం కోలారు బంగారు గనుల్లో (కేజీఎఫ్‌) తవ్వకాలను పునఃప్రారంభించాలని నిర్ణయించింది. గురువారం క్యాబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేజీఎఫ్‌లో తవ్వకాలను ప్రారంభించాలని కేంద్రం చేసిన ప్రతిపాదనకు సిద్ధ రామయ్య సర్కారు ఆమోదం తెలిపింది. కోలార్ జిల్లాలోని భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్‌కు అనుబంధంగా ఉన్న 13 టెయిలింగ్ డంప్‌లలో కార్యకలాపాల కొనసాగింపుపై కేంద్ర ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. అయితే, బీజీఎల్‌కు చెందిన 2,330 ఎకరాలను ప్రతిపాదిత పారిశ్రామిక టౌన్‌షిప్‌‌కు బదిలీ చేయాలని కోరింది.

క్యాబినెట్ సమావేశం అనంతరం శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ మాట్లాడుతూ.. ఎంఎండీఆర్ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అనుమతి అవసరం కాబట్టి క్యాబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. ‘‘కేజీఎఫ్‌లోని భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ (బీజీఎల్) మైనింగ్ ఏరియాలో 1,003.4 ఎకరాల విస్తీర్ణంలో 13 టైలింగ్ డంప్స్ ఏరియాలో గనుల, ఖనిజాల నియంత్రణ అభివృద్ధి (ఎంఎంఆర్డీ) చట్టం సెక్షన్ 17 కింద గనుల తవ్వకాలు కొనసాగించాలన్న కేంద్ర ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది’’ అని పేర్కొన్నారు.

తవ్వకాలు మొదలైతే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని మంత్రి పాటిల్ అన్నారు. బీజీఎల్‌కు చెందిన 2,330 ఎకరాల భూమిని ప్రతిపాదిత టౌన్‌షిప్ కోసం బదిలీ చేయాలని కేంద్రాన్ని కోరినట్టు తెలిపారు. 2022-23 వరకు కర్ణాటకకు రూ. 75,24,88,025 బకాయిలను బీజీఎల్ చెల్లించాల్సి ఉందని అన్నారు. ఈ బకాయిలను చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని స్పష్టం చేశారు.

bottom of page