వైసీపీ ప్రభుత్వంపై మాజీ సీఎం, బీజేపీ నాయకుడు నల్లారి కిరణ్కుమారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రా లిక్కర్ స్కాం ముందు ఢిల్లీలో వెలుగుచూసిన లిక్కర్ కుంభకోణం బలాదూర్ అని వ్యాఖ్యానించారు.
తాజా పార్లమెంటు ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని రాజంపేట నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్పై ఉమ్మడి మిత్రపక్షాల అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఈ క్రమంలో ఆయన గత రెండు రోజులుగా ఇక్కడే పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో గత ఏడాది వెలుగు చూసిన లిక్కర్ కుంభకోణంలో ఆ రాష్ట్రం సీఎం, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయిన విషయం తెలిసిందే. ఇక, ఇదే కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. వీటిని ప్రస్తావిస్తూ.. కిరణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. “ఆంధ్రా లిక్కర్ స్కాం ముందు ఢిల్లీ లిక్కర్ స్కాం బలాదూర్” అని కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.