top of page
MediaFx

2024 లోక్​సభ ఎన్నికల ఫలితాల్లో కీలక పరిణామం..కింగ్​ మేకర్​గా చంద్రబాబు నాయుడు..!

2024 లోక్​సభ ఎన్నికల ఫలితాల్లో ఊహించిన దాని కన్నా మెరుగైన ప్రదర్శన చేస్తూ.. అధికార ఎన్​డీఏకి టఫ్​ ఫైట్​ ఇస్తోంది విపక్ష ఇండియా కూటమి. ప్రస్తుత ట్రెండ్స్​ చూస్తుంటే.. కాంగ్రెస్​- ఇండియా కారణంగా.. బీజేపీ- ఎన్​డీఏకి ఊహించిన దాని కన్నా తక్కువ సీట్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఇప్పుడు దేశ ప్రజల చూపు ఆంధ్రప్రదేశ్​పై పడింది. మరీ ముఖ్యంగా.. 2024 ఆంధ్రప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికలు, లోక్​సభ ఎన్నికల కోసం బీజేపీతో పొత్తుపెట్టుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. కింగ్​ మేకర్​ అయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కింగ్​ మేకర్​గా చంద్రబాబు నాయుడు..!

2024 ఆంధ్రప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన- బీజేపీ కూటమి గెలుపు దాదాపు ఖరారైపోయింది. కూటమి దెబ్బకు వైసీపీకి చెందిన కొంచుకోటలు ధ్వంసమవుతున్నాయి. అయితే.. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ.. లోక్​సభ ఎన్నికల్లోనూ మెరుగైన ప్రదర్శన చేస్తుండటం విశేషం.

ఆంధ్రప్రదేశ్​లో మొత్తం 25 లోక్​సభ సీట్లు ఉన్నాయి. ట్రెండ్స్​ ప్రకారం.. ఈ 25లో టీడీపీ 14 స్థానాల్లో లీడింగ్​లో ఉంది. ఇంకా చెప్పాలంటే.. 25 స్థానాల్లో టీడీపీ పోటీ చేసింది 17 స్థానాల్లోనే! మొత్తం మీద ఇక్కడ కూటమి 22 చోట్ల లీడింగ్​లో ఉంది. వైసీపీ 2 చోట్ల, కాంగ్రెస్​1 చోట ఆధిక్యంలో ఉన్నాయి.

అటు.. కేంద్రంలో.. ఉదయం 11 గంటల 3 నిమిషాల వరకు.. ఎన్​డీఏ కూటమి 285 స్థానాల్లో లీడింగ్​లో ఉంది. విపక్ష ఇండియా కూటమి 231 సీట్లల్లో ముందు ఉంది. ఇతరులు 26 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.

లోక్​సభలో మెజారిటీ మార్క్​ 272. ఒకవేళ ప్రస్తుత ట్రెండ్​ కొనసాగి.. ఎన్​డీఏ కూటమి 285 సీట్లల్లోనే గెలిస్తే.. చంద్రబాబు నాయుడు టీడీపీ సంపాదించుకునే సీట్లు ఎన్​డీఏలో అత్యంత కీలకంగా మారుతాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

2023 నవంబర్​లో జైలుకు వెళ్లిన చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు మళ్లీ అఖండ విజయంతో దూసుకురావడం సర్వత్రా హాట్​టాపిక్​గా మారింది. రాజకీయ విశ్లేషకుల ప్రకారం.. ఆయన జైలుకు వెళ్లడం కలిసి వచ్చింది! వైసీపీపై వ్యతిరేకత ఇంకాస్త పెరిగింది. అవే.. తాజా ఎన్నికల ఫలితాల్లో కనిపిస్తున్నాయి.

2014 నుంచి 2019 వరకు ఎన్​డీఏలో భాగంగా ఉన్న టీడీపీ.. ఆంధ్రప్రదేశ్​కు ప్రత్యేక హోదా విషయంలో విభేదాల కారణంగా.. కూటమిలో నుంచి బయటకు వచ్చేసింది. ఈసారి.. వైసీపీ జగన్​ మోహన్​ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా.. జేనసెన, బీజేపీతో పొత్తు పెట్టుకుంది.


bottom of page