top of page
MediaFx

మళ్లీ జైలుకు వెళ్లినా ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేయను..



ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి.. ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌ మంజూరు కావడంతో బయటికి వచ్చిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. మధ్యంతర బెయిల్ గడువు ముగిసి.. మళ్లీ తాను తీహార్ జైలుకు వెళ్లినా.. ఢిల్లీ సీఎం పదవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయనని స్పష్టం చేశారు. జైలులో ఉండి అయినా.. ఢిల్లీలో పాలన సాగిస్తానని తేల్చి చెప్పారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన తాను.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తే.. అది దేశంలో చాలా పెద్ద ప్రభావం చూపిస్తుందని పేర్కొన్నారు.

తాను సీఎం పదవికి రాజీనామా చేస్తే దేశంలో ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులను అరెస్టు చేసేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చినట్లే అవుతుందని స్పష్టం చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ - ఈడీ.. కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయగా.. ఆ తర్వాత తీహార్ జైలుకు తరలించారు. తీహార్ జైలు నుంచే ఢిల్లీ పాలనా వ్యవహారాలు చేస్తున్నానని చెబుతున్న కేజ్రీవాల్‌ను.. రాజీనామా చేయాలని బీజేపీ నేతలు కొన్ని రోజులుగా డిమాండ్‌ చేస్తున్నారు.

బీజేపీ నేతల డిమాండ్లపై తాజాగా స్పందించిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయనని తేల్చి చెప్పారు. గతంలో ఇన్‌కమ్‌ టాక్స్‌ కమిషనర్‌ పదవిని వదిలేసి.. ఢిల్లీలోని మురికివాడల్లో పని చేసినట్లు గుర్తు చేశారు. 2013 లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికైనా.. 49 రోజుల్లోనే ఆ పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. ఆరోజు రాజీనామా ఎందుకు చేశావని ఎవరూ అడగలేదని తెలిపారు. చాలా మంది చిన్న చిన్న ఉద్యోగాలను కూడా వదులుకోరని.. కానీ తాను ఏకంగా సీఎం పదవిని వదిలేసినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం తాను ప్రజల కోసం పోరాడుతున్నానని.. అందుకే రాజీనామా చేయడం లేదని కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు.

ఢిల్లీ లిక్కర్ కేసు అంతా ఉట్టి బూటకపు కేసు అని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి 67 స్థానాలు వచ్చాయని.. ఇక 2020 ఎన్నికల్లో 62 సీట్లు తమ పార్టీ గెలుచుకున్నట్లు తెలిపారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆప్‌ను ఓడించలేమని భావించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. తనను అరెస్ట్ చేయించారని ఆరోపించారు. తప్పుడు కేసులతో తమ పార్టీలో కీలక నేతలు అయిన మనీష్ సిసోడియా, సంజయ్‌ సింగ్‌ సహా మరికొందరిని బీజేపీ అరెస్ట్ చేయించిందని మండిపడ్డారు.

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తాను.. ఒకవేళ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తే మిగతా రాష్ట్రాల్లో ఉన్న ప్రతిపక్ష ముఖ్యమంత్రులను కూడా అరెస్ట్ చేసే అవకాశం కేంద్రంలోని బీజేపీకి ఇచ్చినట్లు అవుతుందని పేర్కొన్నారు. అప్పుడు పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌లను కూడా అరెస్ట్ చేయవచ్చని తెలిపారు. అందుకే తాను రాజీనామా చేయనని కేజ్రీవాల్ తెగేసి చెప్పారు.

bottom of page