top of page
MediaFx

చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌లో కంగనాకు చెంపదెబ్బ: కారణం తెలుసా?

బాలీవుడ్‌ నటి, లోక్‌సభ ఎన్నికల్లో మండి నుంచి విజయం సాధించిన కంగనా రనౌత్‌‌ను చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌లో సీఐఎస్‌ఎఫ్‌ మహిళా కానిస్టేబుల్‌ కుల్విందర్‌ కౌర్‌ చెంపదెబ్బ కొట్టిన విషయం తెలిసిందే. ఈ షాకింగ్‌ ఘటనకు సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, కంగనాను తాను ఎందుకు కొట్టాల్సి వచ్చిందో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ వివరణ ఇచ్చారు. సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే ఇప్పుడు చెంప పగలగగొట్టానని అన్నారు. రైతుల ఉద్యమంలో తన తల్లికూడా పాల్గొన్నారని చెప్పారు. రైతులను కించపరిచినందుకే ఆమెను ఈ శాస్తి చేశానని పేర్కొన్నారు. 

‘రూ.100 కోసం రైతులు అక్కడ కూర్చున్నారని ఆమె స్టేట్‌మెంట్ ఇచ్చింది.. ఆమె వెళ్లి అక్కడ కూర్చుంటారా? ఈ స్టేట్‌మెంట్ ఇచ్చేటప్పుడు మా అమ్మ అక్కడ కూర్చుని నిరసన తెలుపుతున్నారు..’ అని కౌర్ తెలిపారు. రైతులను అవమానించడంతోనే కంగనాను కొట్టానని అని కానిస్టేబుల్ చెప్పారు. 2020లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతులు చేపట్టిన ఉద్యమాన్ని విమర్శిస్తూ కంగనా ఎక్స్‌ (ట్విట్టర్)‌లో దారుణమైన పోస్ట్‌‌లు పెట్టారని, అన్నదాతలను ఉగ్రవాదులతో పోల్చి అవమానించారని వ్యాఖ్యానించారు.

కాగా, ఎన్నికల్లో విజయం తర్వాత తొలిసారి ఢిల్లీకి గురువారం మధ్యాహ్నం బయల్దేరిన కంగన.. విమానం ఎక్కేందుకు చండీగఢ్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఆమె బోర్డింగ్‌ పాయింట్‌కు వెళ్తుండగా సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ చెంపలుపై ఎడాపేడా వాయించారు. ఊహించని ఈ పరిణామంతో కంగనా షాక్ తిన్నారు. ఢిల్లీకి చేరుకున్న తర్వాత ఆమె ఈ విషయం గురించి పంచుకున్నారు. ఎందుకు కొడుతున్నావని అడిగితే.. తాను రైతులకు మద్దతుదారునని సమాధానం చెప్పినట్టు తెలిపారు. తాను క్షేమంగా ఉన్నాను కానీ పంజాబ్‌లో ఉగ్రవాదం పెరుగుతున్నందుకే తనకు ఆందోళనగా ఉందని కంగనా అన్నారు.

చండీగఢ్ ఎయిర్‌పోర్ట్‌ వీడియోను కంగనా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే, అందులో కంగనా, కానిస్టేబుల్ మధ్య వాగ్వాదం జరుగుతోంది. ఆమెను కొట్టిన దృశ్యాలు మాత్రం అందులో లేవు. ఈ ఘటనపై హరియాణా సీఎం నాయబ్ సింగ్ సైనీ విచారణకు ఆదేశించారు. నివేదిక ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. సెక్యూరిటీకి సంబంధించిన ఓ వ్యక్తి ఇందులో పాల్గొనడం బాధాకరమని, ఏది జరిగినా తప్పేనని ఆయన పేర్కొన్నారు.

నవంబరు 2020 నుంచి నెలల పాటు దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఉద్యమం యావత్తు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అన్నదాతలకు మద్దతుగా పలువురు అంతర్జాతీయ స్థాయి వ్యక్తులు ట్వీట్‌లు చేసి సంఘీభావం తెలిపారు. పాప్ సింగర్ రిహాన్నా, గ్రేటా థ్రెన్‌బర్గ్ చేసిన ట్వీట్‌లకు కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే, రోహిత్ శర్మపై కూడా అనుచితంగా ట్వీట్ చేశారు.


bottom of page