హసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అకృత్యాలపై కర్ణాటక పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా, హసనకు చెందిన జేడీఎస్ మహిళ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రజ్వల్పై పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. వీటితోపాటు అసభ్యకర ప్రవర్తన, బెదిరించి అభ్యంతరకర వీడియోలు తీయడం వంటి అభియోగాలను అతడిపై మోపారు. తుపాకీతో బెదిరించి తనపై మూడేళ్లుగా ప్రజ్వల్ అత్యాచారం చేశాడని బాధిత మహిళ ఆరోపించారు. జనవరి 1, 2021 నుంచి 2024 ఏప్రిల్ 25 మధ్య తనపై పలుసార్లు అత్యాచారం చేసి, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆమె ఆరోపించారు. వీడియోలు, ఫోటోలు తీసి.. తనకు సహకరించకపోతే సోషల్ మీడియాలో లీక్ చేస్తానని బెదిరించినట్టు ఆ మహిళ వాపోయారు. ‘జనవరి 1,2021లో ప్రజ్వల్ రేవణ్ణ తనపై మొదటిసారి తుపాకీతో బెదిరించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు... ఆ దారుణాన్ని అతడి మొబైల్ ఫోన్లో వీడియో తీశాడు.. ఎంపీ క్వార్టర్కు తీసుకెళ్లి తుపాకీ చూపించి బెదిరింపులకు తెగబడ్డాడు... ఈ విషయం ఎవరికైనా చెబితే నన్నూ, నా భర్తను చంపుతానని బెదిరించాడు. తనకు సహకరించకపోతే.. అసభ్యకర వీడియోలను బహిర్గతం చేస్తానని హెచ్చరించాడు.. 2021 జనవరి 1 నుంచి 2024 ఏప్రిల్ 25 మధ్య వీడియోలు చూపించి అనేకసార్లు తనపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడ్డాడు ’ అని బాధిత మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
‘ప్రభుత్వ బాలిక హాస్టల్లో సీటు విషయమైన మొదటిసారి హసన ఎంపీ క్వార్టర్స్లో ప్రజ్వల్ రేవణ్ణను కలిశాను.. అక్కడకు వెళ్లిన తర్వాత హాల్లో నాతో మాట్లాడిన ప్రజ్వల్.. పైన మరికొందరు మహిళలు ఉన్నారని అక్కడకు వెళ్తే నేను మళ్లీ వచ్చి మాట్లాడుతానని చెప్పారు.. అతడు చెప్పినట్టే పైకి వెళ్తే.. కొద్దిసేపటి తర్వాత వచ్చి మిగతా మహిళలను మాట్లాడి పంపాడు.. తర్వాత తనను గదిలోకి పిలిచి.. తన తల్లి భవానీ రేవణ్ణకు ఎమ్మెల్యే టిక్కెట్ దక్కకపోవడానికి నా భర్తే కారణమని, అతడ్ని అదుపులో పెట్టకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని భయపెట్టాడు.. తుపాకితో బెదిరించి బలవంతంగా దుస్తులు విప్పించి, వీడియో రికార్డు చేశాడు.. ఆ వీడియోలు, ఫోటోలతో తనపై పలుసార్లు అత్యాచారం చేశాడు’ అని ఆరోపించింది. ఇక, ప్రజ్వల్ రేవణ్ణపై ఫిర్యాదు చేసిన మహిళ.. మాజీ ప్రభుత్వ ఉద్యోగిగా తెలుస్తోంది. ఆమె ఫిర్యాదు ఆధారంగా మే 1న సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
ఇక, తన లైంగిక దాడులు, అఘాయిత్యాల వీడియోలు బయటకు రావడంతో ప్రజ్వల్ రేవణ్ణ దుబాయ్ మీదుగా జర్మనీకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అయితే, బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై అత్యాచారం కేసు నమోదు చేసినట్లు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన ఎక్కడున్నా పట్టుకొస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రజ్వల్ను రక్షించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించిన సీఎం.. వారికి తెలియకుండా నిందితుడు దేశం దాటి వెళ్లలేడని మండిపడ్డారు. ఈ క్రమంలో అతడి డిప్లొమాటిక్ పాస్పోర్టును రద్దు చేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశానని సిద్ధూ అన్నారు. అది రద్దయితే.. అతడు విదేశాల్లో ఉండటానికి వీలులేదన్నారు.