సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ ఈసారి జగన్మోహన్రెడ్డి దారుణంగా ఓడిపోతున్నారని జోస్యం చెప్పారు. తిరుపతిలో మాట్లాడుతూ, గత ఐదేళ్లలో వైసీపీ నాయకులు చేయని పాపాలంటూ లేవని, అందుకే ప్రజలందరూ కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారని తెలిపారు.
జగన్ ఓడిపోతున్నారని తెలిసినా, వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తుండడం విడ్డూరమని విమర్శించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై రాజకీయంగా కక్ష పెంచుకున్న జగన్, ఆయనను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏబీవీకి విధులు కేటాయించాలని సీఎస్ జవహర్రెడ్డికి లేఖ రాశానని, పదవీ విరమణ రోజు ఆయనకు పోస్టింగ్ ఇవ్వడం సంతోషాన్నిచ్చిందని చెప్పారు.
ప్రధాని మోదీ కన్యాకుమారి వెళ్లడం పాపాలను కడుక్కునేందుకేనని, అక్కడ ధ్యానం చేయడం అంటే ఆ ప్రాంతాన్ని కలుషితం చేయడమేనని నారాయణ విమర్శించారు.