ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) సీజన్ 17 నేటి (మార్చి 22) నుంచి ప్రారంభమవుతుంది. చెన్నై వేదికగా జరగనున్న ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్లో ఆర్సీబీ జట్టు డిఫెండింగ్ చాంపియన్ సీఎస్కేతో తలపడనుంది. ఈ మ్యాచ్తో ఐపీఎల్లో రెండు కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ నిబంధనలతో అంపైర్లు, బౌలర్లు కాస్త రిలాక్స్ అవుతారు. మరి ఈసారి ఐపీఎల్లో అమలు చేయబోయే కొత్త రూల్స్ ఏంటో తెలుసుకుందాం.
స్మార్ల్ రీప్లే సిస్టమ్..
డెసిషెన్ రివ్యూ సిస్టమ్ (DRS) లో లోపాలను సరిచేయడానికి ఈ సంవత్సరం IPL లో స్మార్ట్ రీప్లే సిస్టమ్ (SRS) ప్రవేశపెట్టారు. ఎస్ఆర్ఎస్ నిబంధన అమలుతో ఈ ఐపీఎల్లో థర్డ్ అంపైర్ నిర్ణయం మరింత కచ్చితం కానుంది. ఎందుకంటే దీని కోసం ఫీల్డ్లో మొత్తం 8 హాక్-ఐ కెమెరాలను ఉంచుతారు. వాటి ద్వారా ఫీల్డ్లోని అన్ని దృశ్యాలను చిత్రీకరిస్తారు. అలాగే, స్పష్టమైన చిత్రంతో హాక్-ఐ ఉపకరణాల సహాయంతో థర్డ్ అంపైర్ వెంటనే నిర్ణయాన్ని ప్రకటిస్తాడు. స్మార్ట్ రీప్లే సిస్టమ్ను ఉపయోగించడంతో, థర్డ్ అంపైర్ వీడియోను విభిన్న కోణాల నుంచి సమీక్షించవచ్చు. హాకీ ఆపరేటర్లు ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్లను ఉపయోగిస్తారని దీని అర్థం. దీని నుండి, తక్షణ తీర్పు కోసం సంబంధిత సిట్యువేషన్ స్క్రీన్ సహాయం తీసుకోవచ్చు. ఉదాహరణకు, ఒక ఫీల్డర్ బౌండరీ లైన్లో క్యాచ్ తీసుకున్నాడనుకుందాం. ఈ సందర్భంలో, ఫీల్డర్ కాలు బౌండరీ లైన్ను తాకిందో లేదో తెలుసుకోవడానికి, కాలు భాగం వీడియోను వెంటనే స్ప్లిట్ స్క్రీన్లో తనిఖీ చేయవచ్చు. అలాగే, పాదంలో ఏ భాగం బౌండరీ లైన్ను తాకింది అనేది కూడా స్పష్టంగా కనిపిస్తుంది.
బౌన్సర్ రూల్
ఈ ఐపీఎల్లో ఒకే ఓవర్లో 2 బౌన్సర్లు విసిరే అవకాశం ఉంటుంది. ఇంతకు ముందు ఒక ఓవర్లో 1 బౌన్సర్ మాత్రమే వేసేందుకు అనుమతి ఉండేది. ఇప్పుడు ఒకే ఓవర్లో రెండు బౌన్సర్లు వేసేందుకు బౌలర్లకు అనుమతి ఉంది. రెండు బౌన్సర్ల నిబంధనను అమలు చేయడం వల్ల బౌలర్లు మరింత ప్రయోజనం పొందుతారు. గతంలో ఒక ఓవర్లో ఒక బౌన్సర్ను మాత్రమే అనుమతించేవారు. 2వ బౌన్సర్ను అంపైర్ నో బాల్గా పరిగణించారు. ఇప్పుడు ఒక ఓవర్లో 2 బౌన్సర్లు ఉండటంతో బ్యాటర్లకు దబిడిదిబిడే. ఎందుకంటే గతంలో ఒక బౌన్సర్ ముగిసిన తర్వాత మరో బౌన్సర్ వేయరని బ్యాటర్లకు తెలుసు. కానీ ఈసారి 6 బంతుల్లో 2 బౌన్సర్లు ఉండటంతో బౌలర్లు పరిస్థితిని బట్టి బౌన్సర్ను ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా ఉత్కంఠ భరిత మ్యాచుల్లో ఈ నియమం బౌలర్లకు ప్రయోజనకరంగా ఉంటుంది. 🏏✨