top of page
Shiva YT

🇱🇰 భారత జాలర్లను అరెస్టు చేసిన శ్రీలంక.!

తమ జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారని ఆరోపిస్తూ భారత్‌కు చెందిన 27 మంది మత్స్యకారులను శ్రీలంక నౌకాదళం అరెస్టు చేసింది. ఆదివారం రాత్రి పాయింట్‌ పెడ్రోకు ఉత్తరాన ఉన్న జలాల్లో వీరిని అదుపులోకి తీసుకుని, పడవను స్వాధీనం చేసుకున్నారు.

ఈ మేరకు శ్రీలంక నేవీ సోమవారం అధికారిక ప్రకటనలో వెల్లడించింది. దర్యాప్తు నిమిత్తం జాలర్లను అధికారులకు అప్పగించినట్లు తెలిపింది. కాగా.. భారత జాలర్లను శ్రీలంక నేవీ అరెస్టు చేయడం రెండు రోజుల్లో ఇది రెండోసారి. గత శనివారం 12 మంది మత్స్యకారులను అదుపులోకి తీసుకుని, వారి మూడు పడవలను స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్నేషనల్‌ మారిటైం బౌండరీ లైన్‌ను దాటి తమ జలాల్లో చేపల వేట చేశారన్న ఆరోపణలపై వారిని అరెస్టు చేశారు. భారత్‌, శ్రీలంక మధ్య కొన్నేళ్లుగా ఈ మత్స్యకారుల అంశం సమస్యగా మారింది. తమిళనాడు, శ్రీలంకను వేరు చేసే పాక్‌ జలసంధిలో మత్స్యసంపద సమృద్ధిగా ఉంది. ఇక్కడ చేపల వేటకు వెళ్లిన భారత జాలర్లను గతంలో పలుమార్లు శ్రీలంక అధికారులు అరెస్టు చేయడమేగాక, వారిపై కాల్పులు జరిపిన సందర్భాలున్నాయి. 2023లో లంక నేవీ 240 మంది భారత మత్స్యకారులను అదుపులోకి తీసుకుంది. దీనిపై ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి. 🌊🐟


Comments


bottom of page