top of page
MediaFx

హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కానుందా ?


ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి తెలంగాణ కొత్త రాష్ట్రంగా 2014 జూన్ 2న ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. కాగా విభజన చట్టం ప్రకారం పదేళ్ల పాటు హైదరాబాద్ రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని అని ప్రకటించారు. ఆ గడవు ఈ ఏడాది జూన్ 2తో ముగియనుంది. అయితే ఆ తర్వాత హైదరాబాద్ పరిస్థితి ఏంటనే చర్చ చాలా రోజుల నుంచి జరుగుతోంది. కొందరు పొలిటికల్ లీడర్లు రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నారు. ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌పై కీలక కామెంట్స్ చేశారు. హైదరాబాద్‌ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. జూన్ 2 తర్వాత ప్రయత్నాలు ప్రారంభిస్తారనే అనుమానం తనకు ఉందని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఒప్పందం కుదిరిందని కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు.ఈ నేపథ్యంలో కేటీఆర్ వ్యాఖ్యలపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్ సరికావని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే అవకాశమే లేదని రేవంత్ తేల్చి చెప్పారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చేది తమ ప్రభుత్వమేనని.. కేంద్రపాలిత ప్రాంతం భయం అక్కర్లేదని నగర ప్రజలకు వెల్లడించారు. ఒకవేళ హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా చేసినా.. రాష్ట్ర ఆదాయం ఏ మాత్రం తగ్గదని అన్నారు.

ఇక రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో రాజకీయ కార్యకాలాపాలు ముగిశాయని చెప్పారు. నేటి నుంచి పూర్తి స్థాయిలో రాష్ట్ర అభివృద్ది, పరిపాలనపై దృష్టి పెడతామని చెప్పారు. కాగా, హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేసే ఉద్దేశ్యం లేదని గతంలో బీజేపీ కూడా క్లారిటీ ఇచ్చింది. కేటీఆర్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడని.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైరయ్యారు. తాజాగా రేవంత్ రెడ్డి సైతం కేటీఆర్ కామెంట్లను కొట్టిపారేశారు.


bottom of page