top of page
MediaFx

ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు 48°C చేరే అవకాశం! 🔥


ఏపీ, తెలంగాణలో సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. గతంలో ఎన్నడూలేని ఎండ‌లు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో రెడ్‌ అలెర్ట్‌, మరికొన్ని జిల్లాల్లో ఆరెంజ్‌ అలెర్ట్‌లు కొనసాగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే భానుడు ప్రతాపం చూపుతుండటంతో ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మండుటెండ‌ల‌కు తోడు ఉక్కపోత కూడా ఎక్కువవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భానుడి భగభగలు.. వడగాలులతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ప్రధానంగా.. తెలంగాణలో సూర్యుడు నిప్పులవాన కురిపిస్తున్నాడు. పెద్దప‌ల్లి, జ‌గిత్యాల, సూర్యాపేట, ఖ‌మ్మం జిల్లాల్లో 46.7 డిగ్రీలు, న‌ల్లగొండ జిల్లాలో 46.6 డిగ్రీలు, మంచిర్యాల, క‌రీంన‌గ‌ర్ జిల్లాల్లో 46.5, మ‌హ‌బూబాబాద్, నారాయ‌ణ‌పేట జిల్లాల్లో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత‌లు న‌మోదు అయ్యాయి.

తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీల‌కు పైన ఉష్ణోగ్రత‌లు న‌మోదైన‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ వెల్లడించింది. ఇక.. ఏపీలోనూ రికార్డు స్థాయి టెంపరేచర్స్‌ నమోదు అవుతున్నాయి. ఏపీలోని పలు జిల్లాల్లో 47 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డ్‌ అయినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రకాశం జిల్లాలో 47 డిగ్రీలు, నంద్యాల జిల్లాలో 46.7 డిగ్రీలు, నెల్లూరు జిల్లాలో 46.6 డిగ్రీలు, కడప జిల్లాలో 46.4 డిగ్రీలు, అనంతపురం, కర్నూలు, పల్నాడు జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది. 14 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ప్రకటించింది.

ఉష్ణోగ్రతలతోపాటు వేడి గాలులు కూడా తీవ్రంగా పెరిగాయని… మరో మూడు, నాలుగు రోజులపాటు ఏపీ, తెలంగాణలో ఉష్ణోగ్రతలు 45 నుంచి 48 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరిస్తోంది.


bottom of page