top of page

హరీశ్.. రాజీనామా జేబులో పెట్టుకో.. మామ అల్లుళ్లపై రేవంత్ ఫైర్


బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు, మాజీ మంత్రి హరీశ్ రావు సవాల్ స్వీకరిస్తూ ప్రతి సవాల్ విసిరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ లో నిర్వహించిన సభలో రేవంత్ ప్రసంగించారు. వరంగల్‌ అంటే దేశానికే తలమానికమైన పీవీ గుర్తుకొస్తారని, వరంగల్​పేరు చెబితే కాళోజీ, జయశంకర్​లు మదిలో మెదులుతారని సీఎం రేవంత్​రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్​తర్వాత అంతటి స్థాయి ఉన్న వరంగల్‌కు ఔటర్‌ రింగ్‌ రోడ్డుతో పాటు విమానాశ్రయం తీసుకొస్తామని స్పష్టం చేశారు. వరంగల్‌ను పట్టి పీడిస్తున్న చెత్త సమస్యను పరిష్కరిస్తామని హామీ సీఎం ఇచ్చారు. కరీంనగర్‌, ఖమ్మంలో చెత్త ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తామన్నారు. వరంగల్‌కు పెట్టుబడులు తీసుకొస్తామని సీఎం రేవంత్ తెలిపారు. 

ఈ క్రమంలోనే కేసీఆర్, హరీశ్ రావులపై విమర్శలు గుప్పించారు రేవంత్.మామ, అల్లుళ్లు తోక తెగిన బల్లుల్లా ఎగురుతున్నారని రేవంత్​రెడ్డి దుయ్యబట్టారు. తమ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టామని గొప్పలు చెప్పుకున్నారని.. అప్పుడే అది కూలిపోయిందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలపై చర్చిద్దాం అసెంబ్లీకి రావాలని సవాల్​విసిరారు. రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు చేపడితే, మేడిగడ్డ మేడిపండు అయిందని, సుందిళ్ల సున్నం అయిందని రేవంత్ ఎద్దేవా చేశారు. ఈ పార్లమెంట్​ఎన్నికల్లో బీఆర్​ఎస్‌​కు డిపాజిట్లు వచ్చే పరిస్థితులు లేవని రేవంత్​రెడ్డి చెప్పారు. పంద్రాగస్టులోపు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తామని అంటున్నారంటూ హరీశ్ రావును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామన్న రేవంత్​రెడ్డి.. హరీశ్‌ రావు రాజీనామా పత్రం జేబులో పెట్టుకోవాలని సూచించారు. కేసీఆర్‌ మాదిరిగా హరీశ్‌ రావు మాట తప్పొద్దని సూచించారు. ప్రజలకు చిత్తశుద్ధితో సేవలందించే నాయకులు కావాలని సీఎం రేవంత్​రెడ్డి వ్యాఖ్యానించారు. టికెట్‌ కోసం కడియం శ్రీహరి కాంగ్రెస్‌ను సంప్రదించలేదన్న రేవంత్.. కోట్ల సంపద చూసి కాదు, నిజాయతీ చూసి కావ్యకు టికెట్‌ ఇచ్చామని తెలిపారు. వరంగల్‌ అభివృద్ధి, అవసరాలు తీర్చే బాధ్యత తనదని, వరంగల్‌కు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చే బాధ్యత తాను తీసుకుంటామన్నారు. కావ్యకు, భూములు మింగిన అనకొండకు మధ్య పోటీ అని, కాంగ్రెస్‌​కు ఓటు వేసి కావ్యను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని సీఎం రేవంత్ కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. పదేళ్లలో తెలంగాణకు ఏం చేయలేదన్నారు. 


bottom of page