top of page

🚩 హనుమంతుడికి అమరత్వం ఎవరు ఇచ్చారు..? 🚩


రామ భక్తాగ్రేసరుడు హనుమంతుడిని ఆరాధించడానికి, ఆశీర్వాదం పొందడానికి మంగళవారం అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. హనుమంతుడిని అంజనీ పుత్రుడు, పవన పుత్రుడు, సంకట్ మోచనుడు, రామ భక్త హనుమాన్, బజరంగబలి, మహాబలి వంటి అనేక పేర్లతో పిలుస్తారు. ఈ పేర్లతో పాటు హనుమంతుడిని చిరంజీవి అని కూడా పిలుస్తారు. చిరంజీవి అంటే మరణం లేని వ్యక్తీ అని అర్ధం. భూమిపై భౌతికంగా ఇప్పటికీ ఉన్న దైవం అని హిందువుల విశ్వాసం. నేటికీ భూలోకంలో ఉంటూ తన భక్తుల సమస్యలను వింటూ వారి సమస్యలను పరిష్కరిస్తున్నాడు. నమ్మి కొలిచిన భక్తుల కోరిన కోర్కెలు తీరుస్తున్నాడు. అయితే బజరంగబలికి చిరంజీవిగా జీవించు అనే వరం ఇచ్చింది ఎవరో తెలుసా? దీనికి సంబంధించిన ఆసక్తికరమైన కథనం గురించి తెలుసుకుందాం.

హనుమంతునికి అమరత్వం అనే వరం ఎవరు ఇచ్చారంటే?

పురాణాల గ్రంధాల ప్రకారం రావణుడు సీతాదేవిని అపహరించినప్పుడు.. శ్రీ రాముడు ఆజ్ఞతో సీతదేవి జాడ కోసం వానరులు వెదకడం మొదలు పెట్టారు. అలా వానరులు లంకలో సీతమ్మ జాడ దొరుకుంటుందని భావించి మహాబలి హనుమంతుడిని లంకకు పంపారు. మహా సముద్రాన్ని దాటి లంకలోని అశోక వనంలో ఉన్న సీతాదేవిని చూశాడు. అక్కడ శోక సంద్రంలో ఉన్న సీతాదేవితో రాముడు చెప్పిన విషయాన్నీ చెప్పి.. సీతాదేవి కన్నీరుని తుడిచాడు.

రావణుడి చేర నుంచి సీతదేవిని తిరిగి తీసుకువెళ్లడానికి శ్రీరామ చంద్రుడు త్వరలో వస్తాడని దైర్యం చెప్పాడు. తాను రామయ్య బంటు..ఆయన ఆజ్ఞ మేరకే లంకకు వచ్చినట్లు చెప్పి.. సీతాదేవి నమ్మడం కోసం హనుమంతుడు.. రాముడు ఇచ్చిన ఉంగరాన్ని సీతాదేవికి బహుకరించాడు. రాముడి ఉంగరాన్ని చూసిన సీతదేవి.. అప్పుడు హనుమంతుడు రాముడు పంపిన రాయబారి అని నమ్మింది.

హనుమంతుని హృదయంలో రాముని పట్ల అపారమైన ప్రేమ, భక్తిని చూసిన సీతాదేవి అతని పట్ల ముగ్ధురాలైంది. రామభక్తుడైన హనుమంతుడిని చిరంజీవిగా మరణంలేని వ్యక్తిగా జీవించమని ఆశీర్వదించింది. హనుమంతుడికి సంబంధించిన అమరత్వం గురించి అనేక పురాణ కథలు నేటికీ ప్రబలంగా వినిపిస్తూనే ఉన్నాయి. వాటికి వాటి సొంత ప్రాముఖ్యత ఉంది.

Comments


bottom of page