top of page
Shiva YT

🌐 ప్రభుత్వమే ఓటీటీ మొదలుపెట్టింది..

🦠 కరోనా కాలంలో సినిమాల పరంగా వచ్చిన అతి పెద్ద మార్పు.. ఓటీటీ ఫ్లాట్‌ఫాంల హవా పెరగడం. కరోనా టైంలో థియేటర్లు మూతబడి.. అవి తెరుచుకున్నాక కూడా జనాలు థియేటర్లకు వెళ్లడానికి పెద్దగా ఆసక్తి ప్రదర్శించని సమయంలో ఓవర్ ద టాప్ ఫ్లాట్ ఫామ్స్ విజృంభించాయి.

కొత్తగా అనేక ఓటీటీలు పుట్టుకొచ్చాయి.🌟 తెలుగులో ‘ఆహా’ కూడా బాగానే సబ్‌స్క్రిప్షన్లు సాధించింది. ఈ మధ్య ‘ఈటీవీ విన్’ కొంచెం దూకుడు చూపిస్తోంది. ఐతే ఈ మధ్య ఓటీటీల జోరు కొంచెం తగ్గినట్లు అనిపిస్తోంది. కాగా ఇప్పుడిప్పుడే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఓటీటీలను నిర్వహించే సంప్రదాయం మొదలవుతోంది. ఆ మధ్య ఆంధ్రప్రదేశ్ సర్కారు చిన్న స్థాయిలో ఒక ఓటీటీని మొదలుపెట్టింది. ఐతే దానికి సరైన స్పందన లేదు. 🔍 కాగా ఇప్పుడు కేరళ ప్రభుత్వం కొంచెం పెద్ద స్థాయిలో ఓటీటీని నిర్వహించడానికి రంగం సిద్ధం చేసింది. కేరళ ముఖ్యమంత్రి పినరపి విజయన్ చేతుల మీదుగా మొదలైన ఆ ప్రభుత్వ ఓటీటీ పేరు.. సిస్పేస్. కేరళ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ ఓటీటీ నడవనుంది. ముగ్గురు నిపుణుల కమిటీ సినిమాల కొనుగోలు, ఇతర వ్యవహారాలను చూసుకుంటుంది. 35 సినిమాలు, 6 డాక్యుమెంటరీలు, ఒక షార్ట్ ఫిలింతో ఈ ఓటీటీని లాంచ్ చేశారు. భవిష్యత్తులో కంటెంట్ మరింత పెంచనున్నారు. సబ్‌స్క్రిప్షన్ కాకుండా పే పర్ వ్యూ పద్ధతిలో ఈ ఓటీటీ మొదలైంది. ఇందులో ఒక్కో సినిమా వీక్షణకు 75 రూపాయలు చెల్లించాలి. అందులో సగం మొత్తం కంటెంట్ ప్రొవైడర్‌కు వెళ్తుంది. మిగతాది ప్రభుత్వ మెయింటైనెన్స్ అన్నమాట. ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందనను బట్టి సి స్పేస్‌లో కంటెంట్‌ను పెంచి పెద్ద స్థాయికి తీసుకెళ్లాలని చూస్తోంది కేరళ ప్రభుత్వం. 📺

bottom of page