డబుల్ బెడ్రూం లబ్ధిదారులకు జీహెచ్ఎంసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఫైబర్ టు ది హోమ్ (FTTH) పథకం కింద సబ్సిడీ ధరలకు వైర్డు బ్రాడ్బ్యాండ్, కేబుల్ టీవీ కనెక్షన్లను అందించాలని నిర్ణయించింది. ఈ సౌకర్యం ఇప్పటికే ఉన్న, కొత్త హౌసింగ్ బ్లాక్లన్నింటికీ వర్తిస్తుందని తెలిపింది. కేబుల్ టీవీ కనెక్షన్ కోసం తీసుకునే సెటప్ బాక్స్ ధర రూ. 200 మించదని, అలానే రూటర్ ధర రూ. 1,000 మించదని తెలిపింది. వాటికి ఒక సంవత్సరం వారంటీ వ్యవధి ఉంటుందని తెలిపింది.
ఇంటర్నెట్ కనెక్షన్ కోసం ఛార్జీలు:
5 Mbps అపరిమిత గరిష్ట ధర రూ. 200/నెలకు
30 Mbps అపరిమిత గరిష్ట ధర రూ. 300/నెలకు
50 Mbps అపరిమిత గరిష్ట ధర రూ. 400/నెలకు
100 Mbps అపరిమిత గరిష్ట ధర రూ. 500/నెలకు
కాగా హైదరాబాద్లో అర్హులైన వారికి త్వరలోనే డబుల్ బెడ్ రూం ఇళ్లు పంపిణీ చేయనున్నట్టు ఇటీవల మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఏడు ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయని… GHMC అధికారులతో సమన్వయం చేసుకుని అర్హులైన వారికి.. ఆ డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయించనున్నట్టు వెల్లడించారు. లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. అందుకు మరో 3 నెలల టైమ్ కూడా లేదు. ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేస్తుంది. అప్పుడు ఇళ్లను ఇవ్వడం వీలు కాదు. అందువల్ల నోటిఫికేషన్ వచ్చేలోపే పంపిణీ జరపాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. 🏡✨