top of page
MediaFx

🗳️ సార్వత్రిక ఎన్నికల చివరి దశ నేటితో తెరపడనున్న పోరు!

దేశంలో ఏడు విడతలుగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు నేటితో తెరపడనుంది. నేడు చివరి దశలో భాగంగా 8 రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 10.06 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ముఖ్య రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్ (13 స్థానాలు), బీహార్ (8 స్థానాలు), పశ్చిమ బెంగాల్ (9 స్థానాలు), ఒడిశా (6 స్థానాలు), ఝార్ఖండ్ (3 స్థానాలు), పంజాబ్ (13 స్థానాలు), హిమాచల్ ప్రదేశ్ (4 స్థానాలు) ఇవే.

ప్రధాన అభ్యర్థులలో వారణాసి నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మీర్జాపూర్ నుంచి అప్నాదళ్ (సోనీలాల్) నాయకురాలు, కేంద్రమంత్రి అనుప్రియా పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వస్థలం గోరఖ్‌పూర్ నుంచి బీజేపీ సిటింగ్ ఎంపీ రవికిషన్ ఉన్నారు.

వారణాసి నుంచి రెండుసార్లు విజయం సాధించిన మోదీకి ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ గట్టిపోటీ ఇస్తున్నారు. గత ఎన్నికల్లో పంజాబ్‌లోని 13 స్థానాల్లో 8 గెలుచుకున్న కాంగ్రెస్ ఈసారి అంతకుమించి గెలుచుకోవాలని పట్టుదలగా ఉంది. బీహార్ లోని పట్నా, నలందా, పాటలీపుత్ర, అర్హా, ససారమ్, బక్సర్ వంటి స్థానాల్లో కేంద్రమంత్రులు రవిశంకర్ ప్రసాద్, ఆర్కే సింగ్ పోటీ చేస్తున్నారు. గత రెండు ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లో అన్ని నాలుగు స్థానాల్లో గెలిచిన బీజేపీ ఈసారి హ్యాట్రిక్‌పై కన్నేసింది.

సాయంత్రం కోసం ఎదురుచూపులు

నేటితో ఎన్నికలు పూర్తికానున్న నేపథ్యంలో సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ సాయంత్రం ఎప్పుడవుతుందా? అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియనుండగా, 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ ఫలితాల ద్వారా ఓటరు మనోగతాన్ని కొంతవరకు అంచనా వేయొచ్చని భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా అందరి దృష్టి ఆంధ్రప్రదేశ్‌పైనే ఉంది. అధికార మార్పిడి జరుగుతుందా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది.

ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా?

ఎగ్జిట్ పోల్స్ అన్ని వేళలా నిజం కాదని తెలిసినా, అందరూ వాటి కోసం ఎదురుచూస్తుండడం గమనార్హం. 2004లో బీజేపీకి 240 నుంచి 250 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినప్పటికీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2015లో ఢిల్లీలో ఆప్ ఊడ్చేస్తుందని ఎవరూ అంచనా వేయలేకపోయారు. 2017లో యూపీలో హంగ్ వస్తుందని చెప్పినా బీజేపీ ఘన విజయం సాధించింది. అలా ఎగ్జిట్ పోల్స్ తప్పనిసరిగా తప్పని చెప్పడానికి లేదు. చాలాసార్లు దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయి. చూడాలి మరి.. ఈసారి ఏం జరుగుతుందో!

bottom of page